ఏపీలో నిలకడగా కరోనా-మళ్లీ 11 వేలకు పైగా కొత్త కేసులు- 81కి తగ్గిన మరణాలు
ఏపీలో కరోనా ప్రభావం కొనసాగుతోంది. పగటి పూట కర్ఫ్యూ విధిస్తున్నా కేసుల సంఖ్యలో పెద్దగా మార్పేమీ ఉండడం లేదు. తాజాగా మరోసారి 11 వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం స్పల్పంగా తగ్గడం ఊరటగా చెప్పవచ్చు. గత 24 గంటల్లో 11421 కొత్త కేసులు నమోదు కాగా... 81 మంది కరోనాతో చనిపోయారు.
ఏపీలో గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల్ని గమనిస్తే మరోసారి తూర్పుగోదావరి జిల్లా 2308 కేసులతో అగ్రస్ధానంలో నిలిచింది. ఆ తర్వాత చిత్తూరు 1658, అనంతపురం 1041 కేసులతో రెండు, మూడు స్ధానాల్లో ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో పశ్చిమగోదావరి 996, కృష్ణా 841, విశాఖ 814, గుంటూరు 669, ప్రకాశం 607, కడప 602, కర్నూలు 556, నెల్లూరు 546, శ్రీకాకుళం 465, విజయనగరం 318 కేసులు వెలుగుచూశాయి. వీటితో కలుపుకుంటే ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 17.28 లక్షలకు చేరింది. ఇందులో 15.78 లక్షల మంది కోలుకున్నారు. మరో 1.38 లక్షల యాక్టివ్ కేసులున్నాయి.
మృతుల విషయానికొస్తే అత్యధికంగా చిత్తూరులో 13 మంది, అనంతపురంలో 9, శ్రీకాకుళంలో 9, విజయనగరంలో 7, తూర్పుగోదావరి 6, నెల్లూరు 6, విశాఖ 6, కృష్ణాలో 5, కర్నూల్లో 5, పశ్చిమగోదావరిలో 5, గుంటూరులో 4, ప్రకాశంలో 4, కడపలో రెండు మరణాలు చోటు చేసుకున్నాయి. వీటితో కలుపుకుంటే రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనాతో 11213 మంది చనిపోయారు. 24 గంటల్లో ప్రభుత్వం 86223 టెస్టులు నిర్వహించింది. మరోవైపు 24 గంటల్లో 16223 మంది కోలుకున్నారు.