AP Covid Ex-gratia: కరోనా మృతుల కుటుంబాలకు 50 వేల రూపాయల పరిహారం చెల్లింపుకు ఉత్తర్వులు
కరోనా సెకండ్ వేవ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి బీభత్సం సృష్టించింది. కరోనా మహమ్మారి బారిన పడి వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. ఎన్నో కుటుంబాలు తమ వారిని కోల్పోయి నేటికీ తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ఏపీ సర్కార్ అనేక చర్యలు చేపట్టింది. ఇప్పటికీ రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు చేపడుతూనే ఉంది. ఇదే సమయంలో కరోనా మృతుల కుటుంబాలకు ఊరట కలిగించే వార్తను ఏపీ సర్కార్ చెప్పింది.
కీలక ఉత్తర్వులను జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
కరోనా బాధిత కుటుంబాలకు సహాయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు 50 వేల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి ఈ మొత్తాన్ని చెల్లించడానికి ఆదేశాలను జారీ చేసింది. దీనికోసం ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేసి కరోనా మృతుల కుటుంబాల జాబితాను తయారు చేయనుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న ఈ ప్రత్యేక సెల్ కరోనా మృతుల జాబితాను రూపొందించి దానికి అనుగుణంగా చెల్లింపులు చేయాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
దరఖాస్తు తీసుకున్న రెండు వారాల్లోగా పరిహారం చెల్లింపు
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ దీనికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నెంబర్ ను జారీ చేయాలని ఆదేశాలలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాల నుండి దరఖాస్తు తీసుకున్న రెండు వారాల్లోగా పరిహారం చెల్లింపు పూర్తిచేయాలని ప్రభుత్వం సూచించింది. దరఖాస్తు కోసం ప్రత్యేకంగా ఒక ప్రొఫార్మా ను రూపొందించిన వైద్య ఆరోగ్య శాఖ అందులో అన్ని వివరాలను పొందుపరచాలని పేర్కొంది.
బాధిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం భరోసా
కరోనా మహమ్మారి కారణంగా తమ వారిని కోల్పోయిన కుటుంబాలు ఇప్పటికే తీవ్రమైన ఆవేదనతో ఉన్నాయని, వారికి కాస్త ఊరటనిచ్చేలా, భరోసా కల్పించేలా ప్రభుత్వం ఇస్తున్న ఎక్స్గ్రేషియా చెల్లింపు చేయడంలో అలసత్వం వహించకుండా ఉండాలని, బాధిత కుటుంబాలకు త్వరగా సహాయం అందేలా చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా కట్టడి కోసం ప్రయత్నాలు చేస్తూనే, ఆసుపత్రులలో వైద్య సదుపాయాలపై దృష్టి సారించింది.
నిన్నటి వరకు ఏపీలో కరోనా కారణంగా మృతి చెందిన వారు 14,350 మంది
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 295 కరోనా కేసులు నమోదు కాగా, ఏడుగురు మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.దీంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 14,350 కి చేరుకుంది. ఇప్పటివరకు కరోనా కారణంగా మరణించిన వారికే కాకుండా,భవిష్యత్తులో కరోనా బాధిత కుటుంబాలకు కూడా ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే ఆ నిర్ణయాన్ని రాష్ట్రాలు రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నిధుల ద్వారా అమలు చేయనున్నారు.
Recommended Video
కరోనా పరిహారం చెల్లింపుకు కేంద్రం గైడ్ లైన్స్ మేరకు ఏపీ ఉత్తర్వులు
రాష్ట్ర విపత్తు ఉపశమన నిధి నుండి కోవిడ్ -19 తో మరణించిన వారి కుటుంబాలకు రూ .50 వేలు చెల్లించాలని గతంలో సుప్రీం ధర్మాసనానికి చెప్పిన కేంద్రం ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయని , రాష్ట్ర ప్రభుత్వాల సంబంధిత విపత్తు ప్రతిస్పందన నిధుల నుండి ఈ పరిహారాలు చెల్లించబడతాయి అని, జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ లేదా జిల్లా పరిపాలన ద్వారా కుటుంబాలకు పంపించబడతాయని ప్రభుత్వం వెల్లడించింది.
కోవిడ్ మృతుల కుటుంబాలు అవసరమైన పత్రాలను సమర్పించిన 30 రోజుల్లోపు అన్ని క్లెయిమ్లు పరిష్కరిస్తుందని, ఆధార్తో అనుసంధానించబడిన బ్యాంక్ అకౌంట్ కు నేరుగా డబ్బులను బదిలీ చేయడం ద్వారా పంపిణీ చేస్తుందని కేంద్రం అప్పుడు సుప్రీం కోర్టుకు తెలిపిన అఫిడవిట్లో పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలు కూడా ఆ గైడ్ లైన్స్ ప్రకారం కరోనా పరిహారం అందించనున్నారు.