రోజుకు వెయ్యికి పైగా కేసులు, పదికి పైగా మృతులు- ఏపీలో 22 వేలు దాటిన కరోనా బాధితులు..
ఏపీలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 1051 కేసులు నమోదుకాగా.. 12 మంది మృత్యువాత పడ్డారు. 1332 మంది చికిత్స తర్వాత కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వీటితో కలుపుకుని ఇప్పటివరకూ మొత్తం నమోదైన కేసుల సంఖ్మ 22,259కి చేరుకుంది.
రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో రెండు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వీటిలో అనంతపురం, కర్నూలు, తూర్పుగోదావరి, గుంటూరు ఉన్నాయి. వెయ్యికి పైగా కేసులు నమోదైన జిల్లాల్లో పశ్చిమగోదావరి, చిత్తూరు, కృష్ణా, కడప ఉన్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 255 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 173 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో వందకు లోపు కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తాజా బులిటెన్ లో పేర్కొంది.
కరోనా వైరస్ కారణంగా గత 24 గంటల్లో రాష్ట్రంలో 12 మంది చనిపోయారు. ఇందులో కర్నూల్లో ముగ్గురు, అనంతపూర్, కృష్ణా, పశ్చిమగోదావరిలో ఇద్దరేసి, చిత్తూరు, గుంటూరు, విశాఖలో ఒక్కరు చొప్పున మరణించారు. వీరితో కలుపుకుని ఇప్పటివరకూ కరోనా కారణంగా రాష్ట్రంలో చనిపోయిన వారి సంఖ్య 264కు చేరుకుంది. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 11 వేల 101గా నమోదు కాగా... ప్రస్తుతం రాష్ట్రంలో 10894 యాక్టివ్ కేసులు ఉన్నాయి.