ఏపీలో కరోనా మృత్యుకేళి- 24 గంటల్లో 95 మరణాలు- 3 వేలు దాటిన మృతుల సంఖ్య...
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్త కేసుల సంఖ్య తాజాగా రెండు రోజుల నుంచీ పెరుగుతుండగా.. మరోసారి 24 గంటల్లో 9 వేల మార్కు దాటిపోయింది. మరణాల సంఖ్య కూడా ఆగడం లేదు. గత 24 గంటల్లో 95 మరణాలు చోటు చేసుకున్నాయి. వీటితో కలిపి ఇప్పటివరకూ ఏపీలో కరోనా మరణాల సంఖ్య 3 వేలు దాటిపోయింది.
Recommended Video
ఏపీలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న జిల్లాగా తూర్పుగోదావరి, అత్యల్ప కేసులు నమోదవుతున్న జిల్లాగా కృష్ణా కొనసాగుతున్నాయి. తాజా హెల్త్ బులిటెన్లోనూ తూర్పుగోదావరిలో 1357 కేసులు నమోదు కాగా... కృష్ణాలో అత్యల్పంగా 195 కేసులు మాత్రమే తేలాయి. అత్యధిక కేసుల జాబితాలో తూర్పుగోదావరి తర్వాత విశాఖ (985), అనంతపురం (973) ఉన్నాయి. కృష్ణా తర్వాత అత్యల్ప కేసులు నమోదవుతున్న జిల్లాల్లో విజయనగరం (385), కడప (434), గుంటూరు (443) ఉన్నాయి.
కోవిడ్ మరణాల జాబితాలో గత 24 గంటల్లో చిత్తూరు 16 మృతులతో అగ్రస్ధానంలో నిలిచింది. ఆ తర్వాత స్ధానాల్లో ప్రకాశం (11), నెల్లూరు (9), అనంతపురం (8) తూర్పుగోదావరి (8), పశ్చిమగోదావరి (8) కడప (7), గుంటూరు (6), కర్నూలు (6), విశాఖ (6), శ్రీకాకుళం (5), విజయనగరం (3), కృష్ణా (2) మరణాలు ఉన్నాయి.
వీటితో కలుపుకుని ఇప్పటివరకూ రాష్ట్రంలో చనిపోయిన వారి సంఖ్య 3001కు చేరింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 25 వేలు కాగా... కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2 లక్షల 35 వేలు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 87 వేలు ఉన్నాయి. విదేశాల నుంచి కానీ, ఇతర రాష్ట్ర్రాల నుంచి కానీ ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.