స్పూన్లు నాకుతారు:ఢిల్లీ వెళ్లొచ్చిన వారిపై దారుణ కామెంట్లు:క్షమాపణ చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం
చిత్తూరు: కరోనా వైరస్ కల్లోలాన్ని సృష్టిస్తోన్న వేళ.. ఏపీ ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామి ఘాటు విమర్శలకు తెర తీశారు. ఢిల్లీ వెళ్లొచ్చిన వారిపై ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యల పట్ల వివాదాలు చెలరేగడంతో ఆయన వెనక్కి తగ్గారు. క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని అన్నారు. కరోనా వైరస్ పెచ్చిరిల్లుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో శుభ్రతను దృష్టిలో ఉంచుకుని తాను ఆ వ్యాఖ్యలను చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.
ఢిల్లీ వెళ్లొచ్చిన వారి వల్లే..
రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరగడానికి ఢిల్లీలో నిర్వహించిన సామూహిక మత ప్రార్థనలను నిర్వహించడమే ప్రధాన కారణమని అన్నారు. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారే లేకపోయి ఉంటే దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అత్యంత తక్కువగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించి ఉండేదని చెప్పారు. ఢిల్లీ వెళ్లొచ్చిన వారి వల్ల కేసులు పెరిగాయని గుర్తు చేశారు.
ముస్లిం, మైనారిటీలపై కసి లేదంటూ..
మత ప్రార్థనల సమయంలో శుభ్రత పాటించి ఉండరని నారాయణ స్వామి చెప్పారు. ప్లేట్లను కడగరని, స్పూన్లను నాకేస్తుంటారని అన్నారు. వారంతా రాష్ట్రానికి వచ్చారని, ఫలితంగా కేసులు పెరిగి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ముస్లిం, మైనారిటీలపై తనకు కసి లేదని అన్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ భవనంలో నిర్వహించిన తబ్లిగి జమాత్ సామూహిక మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారు ఇప్పటికైనా స్వచ్ఛందంగా ముందుకు రావాలని, వైద్య పరీక్షలను నిర్వహించుకోవాలని కే నారాయణ స్వామి విజ్ఙప్తి చేశారు.
ఆసుపత్రుల్లో సహకరించండి..
తమ ప్రాణాలను తాము కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. తమను తాము కాపాడుకోవడంతో పాటు కుటుంబాలను కాపాడాలని చెప్పారు. సామాజిక దూరాన్ని పాటించాలని అన్నారు. ఆసుపత్రుల్లో సామాజిక దూరాన్ని పాటించట్లేదనే వార్తలు వస్తున్నాయని, నర్సులు, డాక్టర్లకు సహకరించాలని కోరారు. అల్లా దయా స్వరూపుడని, ఈ వైరస్ వెంటనే తగ్గిపోయేలా ప్రార్థనలు చేయాలని నారాయణ స్వామి విజ్ఙప్తి చేశారు. వైద్య చికిత్సను అందించేలా డాక్టర్లకు సహకరించాలని అన్నారు.
దుమారం చెలరేగడంతో..
ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ముస్లింల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని, అలాంటి సమయంలో నారాయణ స్వామి ఈ విషయాన్ని ఎలా ధృవీకరిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారిగా వివాదాలు చుట్టుముట్టడంతో ఉప ముఖ్యమంత్రి వెనక్కి తగ్గారు. తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని అన్నారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఓ పోస్ట్ చేశారు.
Recommended Video