కర్ణాటకలో బిజెపికి వ్యతిరేకంగా ఓటేసి తెలుగోడి సత్తా చూపాలి: ఏపీ డిప్యూటీ సీఎం కెఈ
బెంగుళూరు:ఏపీకి నష్టం చేసిన బిజెపికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా బుద్ది చెప్పాలని ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం కె.ఈ. కృష్ణమూర్తి కర్ణాటక రాష్ట్రంలోని తెలుగు ప్రజలను కోరారు. కర్ణాటక ఎన్నికల్లో తెలుగు వాడి సత్తాను చూపాలని ఆయన పిలుపునిచ్చారు.
కర్ణాటకలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం కె.ఈ కృష్ణమూర్తి మీడియాతో మాల్లాడారు. కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకైనా ఓటేయ్యండి కానీ, బిజెపికి మాత్రం ఓటేయ్యకూడదని కెఈ కృష్ణమూర్తి కర్ణాటకలోని తెలుగు ప్రజలను కోరారు.
కర్ణాటక ఎన్నికల్లో బిజెపిని ఓడించి తెలుగు ప్రజల సత్తాను చూపాలని ఆయన కోరారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంగా ఆయన గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 కోట్ల తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా ఆయన అభిప్రాయపడ్డారు.
తెలుగు ప్రజలకు మోడీ అన్యాయం చేశారని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆయన కోరారు.త్వరలో జరిగే కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి మినహ ఏ పార్టీకైనా ఓటేయాలని ఆయన తెలుగు ప్రజలను కోరారు.రానున్న రోజుల్లో ఉత్తర, దక్షిణాది ప్రాంతాలంటూ గొడవలు వచ్చే అవకాశం కూడ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.