ఏపీలో పాదయాత్రలపై డీజీపీ క్లారిటీ-అనుమతులు కావాలంటే..!
ఏపీలో పాదయాత్రలకు అనుమతుల విషయంలో కొనసాగుతున్న రచ్చ నేపథ్యంలో డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఇవాళ స్పష్టత ఇచ్చేశారు. పాదయాత్రలకు అనుమతి కావాలనుకునేవారు ఏం చేయాలో ఆయన చెప్పేశారు.
ఏపీలో ప్రస్తుతం టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. దీనికి అనుమతుల విషయంలో ప్రభుత్వం, పోలీసులు సహకరించడం లేదని టీడీపీ గతంలో విమర్శలు చేసింది. అలాగే జీవో నంబర్ 1 అమలు పేరుతో గతంలో చంద్రబాబు కుప్పం యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై రాష్ట్రంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇవాళ రాష్ట్ర డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి పాదయాత్రలకు అనుమతులపై స్పష్టత ఇచ్చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పోలీసుల జిల్లా రివ్యూ మీటింగ్ కు హజరైన డీజీపీ రాజేంద్రనాద్ రెడ్డి.. జీవో నంబర్ 1, పాదయాత్రలకు అనుమతుల వ్యవహారంపై స్పందించారు. జీవో నెంబర్ 1 బేస్ చేసుకుని ఎవ్వరినీ బ్యాన్ చేయడం లేదని డీజీపీ తెలిపారు. జీవో నెంబర్ 1 గురించి ఎవరూ ఆందోళన పడనవసరం లేదని ఆయన వెల్లడించారు. ఎక్కడా తామేమీ బ్లాక్ చేయడం లేదన్నారు. జీవో వచ్చిన తరువాత కూడా పోలిటికల్ పార్టీలు మీటింగులు అనుమతులు ఇచ్చామన్నారు.
అలాగే పాదయాత్రలపైనా డీజీపీ క్లారిటీ ఇచ్చారు. ఎవరైనా పాదయాత్ర చేయాలంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అనుమతి తీసుకోవాలని డీజీపీ సూచించారు. మరోవైపు రాష్ట్రంలో గంజాయి సాగు ఇరవై ఐదు ఏళ్ళ నుండి నడుస్తుందన్నారు. గతేడాది నుండి గంజాయి నాశనం చేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న గంజాయి సాగును అక్కడ వాళ్ళు ధ్వంసం చేయాలని డీజీపీ ఆయా రాష్ట్రాల్ని కోరారు. తమ వంతుగా గంజాయి సాగును అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ పేర్కొన్నారు.