వైసీపీ నిరసనలకు ఓకే- అమరావతి పాదయాత్రను అడ్డుకోవద్దు-డీజీపీ కీలక వ్యాఖ్యలు
ఏపీలో అమరావతి రాజధాని కోరుతూ రైతులు అరసవిల్లికి చేపట్టిన పాదయాత్రకు వైసీపీ నేతలు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారు. చాలా చోట్ల పోలీసులు కూడా కొత్త కొత్త ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. వీటిపై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. తమకు అలాంటి ఉద్దేశం లేదన్నారు. పాదయాత్రకు అడ్డంకులపై డీజీపీ ఏం చెప్పారంటే..
అమరావతి పాదయాత్రపై డీజీపీ
అమరావతి పాదయాత్రకు వైసీపీ నిరసనకారులతో పాటు పోలీసుల నుంచి ఎదురవుతున్న నిరసనలపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తొలిసారి స్పందించారు. నిరసనలు చేపడుతున్న వైసీపీ నేతలతో పాటు పోలీసులు కూడా జత కట్టడంపై వస్తున్న విమర్శలపై డీజీపీ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. అలాగే వైసీపీ నేతలకు కీలక సూచన చేశారు. పాదయాత్ర అడ్డుకునేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ తెలిపారు.
వైసీపీ నిరసనలు చేసుకోవచ్చు కానీ..
అమరావతి పాదయాత్ర అడ్డుకునే క్రమంలో నిరసనలకు దిగుతున్న వైసీపీ నేతలకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కీలక సూచన చేశారు. కావాలంటే నిరసనలు చేసుకోమని వారికి సూచించారు. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఇవి చేసుకోవాలని వైసీపీ నేతలకు తెలిపారు. అమరావతి పాదయాత్ర వద్ద నిరసనలకు దిగడాన్ని సమర్ధించడం లేదని, పోలీసు శాఖ తరఫున అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ తెలిపారు. అదే సమయంలో వైసీపీ నేతలకు ఓ కీలక సూచన కూడా చేశారు.
అమరావతి పాదయాత్రను అడ్డుకోవద్దు..
వైసీపీ నాయకులు కావాలంటే నిరసన చేసుకోవచ్చు కానీ అమరావతి రైతుల పాదయాత్రను మాత్రం అడ్డుకోవద్దని నిరసనకారులకు చెబుతున్నామని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న వారిని యాత్ర సాగుతున్న జిల్లా ఎస్పీ ముందుగానే పిలిపించి ఈ విషయాన్ని చెప్పారని ఆయన తెలిపారు. నిరసనలు తెలుపుతున్న వారిని ముందుగానే పిలిపించి యాత్రను అడ్డుకోవద్దని చెబుతున్నామని, కావాలంటే నిరసన తెలుపుకోవచ్చని చెప్పామని, అందుకు వారు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు అయితే ఎక్కడా తీవ్ర సమస్యలు ఎదురుకాలేదని అన్నారు. ఎక్కడైనా అలా జరిగితే చర్యలు తీసుకుంటామన్నారు.
పోలీసులు అడ్డుకోవడం అబద్ధమన్న డీజీపీ..
రైతుల పాదయాత్ర కొన్ని చోట్ల ఉద్రిక్తంగా మారడానికి పోలీసులే కారణమన్న విమర్శలపైనా డీజీపీ స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని, అది పూర్తిగా అబద్ధమని అన్నారు. తాము సమస్యను పరిష్కరించేందుకే ప్రయత్నిస్తాం తప్పితే, దానిని మరింత జటిలం చేయబోమన్నారు. అడ్డంకులు సృష్టించడానికి తమకేం పని అని ప్రశ్నించారు. శాంతి భద్రతల పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. పాదయాత్ర ఇప్పటి వరకు ప్రశాంతంగానే సాగిందని, అదనపు బందోబస్తు కూడా కల్పించామని, కాబట్టి పాదయాత్రపై ఆందోళన అవసరం లేదని అన్నారు.