గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం; నమ్మకం నిలబెట్టుకుంటా: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ నుండి ఆయన తన బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా గౌతం సవాంగ్ నూతన డిజిపికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ డీజీపీ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి డిజిపిగా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని వెల్లడించారు.
నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పని చేస్తా
తనపై ఉంచిన నమ్మకాన్ని మరింత నిలబెట్టుకునే విధంగా పని చేస్తానని పేర్కొన్నారు. ఇదే సమయంలో పోలీసు వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు శాంతి భద్రతల పరిరక్షణలో పని చేస్తామని పేర్కొన్నారు. ఏదైనా మారుమూల ప్రాంతంలో ఒక కానిస్టేబుల్ తప్పు చేసిన సరే మొత్తం పోలీసు వ్యవస్థ పైన ఆరోపణలు వస్తాయని, ఏ విధమైన తప్పులు జరగకుండా పోలీసు వ్యవస్థను కాపాడటానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
మతాల మధ్య సామరస్యం ఉండేలా చూస్తాం: ఏపీ డీజీపీ
మతాల మధ్య సామరస్యం ఉండాలని పేర్కొన్న ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, గత డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏ విధమైన పొరపాట్లు జరగకుండా ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థకు టెక్నాలజీని సమర్థవంతంగా అందించారని, గౌతమ్ సవాంగ్ సామర్ధ్యాన్ని చూసే ముఖ్యమంత్రి ఆయనకు మరో కీలక బాధ్యతలను అప్పగించాలని బిజెపి రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు.
తనను డీజీపీగా ఎంపిక చేసి చాలా పెద్ద బాధ్యత అప్పగించారు
తనను డీజీపీగా ఎంపిక చేసి చాలా పెద్ద బాధ్యత అప్పగించారని పేర్కొన్న రాజేంద్రనాథ్ రెడ్డి జిల్లా స్థాయి పోలీసు అధికారులు కూడా గురుతరమైన బాధ్యతను నిర్వహించాల్సి ఉంటుందని, క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసు సిబ్బందికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాలని పేర్కొన్నారు. ప్రజల ధన మాన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉందని రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. ఇక ఇదే సమయంలో పోలీసు సిబ్బంది పై నిరాధారమైన ఆరోపణలు వస్తే విచారణ చేయించి, నిరాధారమని తేలితే పోలీసులకు అండగా ఉంటానని పేర్కొన్నారు.
డ్రగ్స్, గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ వంటివాటిపై ఉక్కుపాదం మోపుతాం
ఈవ్ టీజింగ్, గుండాయిజం వంటివి జరగకుండా అన్ని రకాల చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ ఏజెన్సీ కేంద్రంగా గంజాయి సమస్య ఉందని, ఇక రాయలసీమ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ సమస్య ప్రధానంగా ఉందని పేర్కొన్న ఆయన డ్రగ్స్, గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ వంటివాటిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో మతవిద్వేషాలు జరగకుండా చూస్తామని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రధానంగా రాజకీయ పార్టీల నాయకుల సహకారం పోలీసులకు కావాలని వెల్లడించారు. రాష్ట్రంలో మత సామరస్యానికి భంగం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే కఠిన చర్యలకు వెనుకాడబోమని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు.
పోలీస్ శాఖలో రాజేంద్రనాథ్ రెడ్డి ప్రస్థానం ఇదే
ఇదిలా ఉంటే 1992 బ్యాచ్ కు చెందిన రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీ గా పనిచేశారు. ఆయన 1994 లో ఉమ్మడి ఏపీలో నిజామాబాద్ జిల్లా బోధన్ అదనపు ఎస్పీగా పోస్టింగ్ లో చేరారు. నిజామాబాద్ జిల్లాలో పలు బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత ఆయన విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలతోపాటు సిఐడి, రైల్వే ఎస్పీగా కూడా పనిచేశారు.
అంతేకాదు విజయవాడ విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గా ఆయన విధులను నిర్వర్తించారు. మెరైన్ పోలీసు విభాగంలో ఉత్తర కోస్తా ఐజీగా పనిచేశారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ లో పనిచేశారు. పలు కీలక కేసులను చేధించే జాతీయస్థాయిలో గుర్తింపును సంపాదించుకున్నారు ప్రస్తుత ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి.