కరోనా పేషెంట్ల వద్దకు భయంభయంగా.. ఏపీలో వైద్యులకు అరకొర సదుపాయాలు..
ఏపీలో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఇటు ప్రభుత్వాన్ని, అటు వైద్యులను కూడా టెన్షన్ లోకి నెడుతున్నాయి. గతంలో ఈ స్ధాయిలో విపత్తులను ఎదుర్కొన్న అనుభవం ఏ ఒక్కరికీ లేకపోవడం, వైద్య, వ్యక్తిగత రక్షణ పరికరాలు, మాస్కుల కొరత కారణంగా వైద్యులు పూర్తిస్దాయిలో విధులు నిర్వర్తించలేని పరిస్ధితులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు ఇలాంటి పరిస్ధితులే ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సిన పరిస్ధితి.

డాక్టర్లకు పర్సనల్ కిట్లు, మాస్క్ ల కొరత..
ప్రపంచంమంతా కరోనా వైరస్ ను చూసి ఇళ్లల్లో తలదాచుకుంటున్న వేళ బాధితుందరికీ వైద్యులే దిక్కయ్యారు. సాధారణ ప్రజానీకమే కాు ఇళ్లలో కుటుంబసభ్యులు కూడా కరోనా బాధితులను చూసి పరుగులు తీస్తున్న నేపథ్యంలో డాక్టర్లు మాత్రం తమ అసాధారణ సేవలతో వారికి ప్రాణం పోస్తున్నారు. అందుకే జాతి యావత్తూ వైద్యులను దేవుళ్లుగా కొలిచే పరిస్దితి. కానీ అందరూ డాక్టర్లు చేస్తున్న సేవ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం కానీ వారు ఎలాంటి పరిస్ధితుల్లో సేవ చేస్తున్నారో గమనించలేని స్ధితిలో ఉంటున్నాం. ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో డాక్టర్లకు వ్యక్తిగత రక్షణ పరికరాలు, నాణ్యమైన మాస్కులు తప్పనిసరి. కానీ ఇప్పుడు వీటి కొరత డాక్టర్లను తీవ్రంగా వేధిస్తోంది.

డాక్టర్లకు రక్షణ కరవు..
ఒక ఊర్లో కరోనా వైరస్ సోకిందని తెలియగానే రోగిని వెంటనే తీసుకొచ్చి క్వారంటైన్ సెంటర్లో లేదా ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రుల్లో చేరుస్తున్నారు. కానీ అక్కడ వారికి వైద్యం చేయాలంటే డాక్టర్లు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వారికి అంతే వేగంగా రోగి నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముంటుంది. సాధారణ పరిస్ధితుల్లో చిన్న చిన్న రోగాలకు చికిత్స చేయాలంటేనే మాస్కులు వాడే డాక్టర్లకు ఇప్పుడు అంతకు మించి్న నాణ్యమైన ఎన్-95 మాస్కులు, వ్యక్తిగత రక్షణ పరికరాలు తప్పనసరిగా మారుతున్నాయి. కానీ దేశవ్యాప్తంగా వీటికి డిమాండ్ నెలకొనడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్ధితి.

భయం భయంగా విధుల్లోకి..
ప్రస్తుతం కరోనా రోగులను పరీక్షించేందుకు ప్రభుత్వం తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలే అంతంతమాత్రంగా ఉంటున్నాయి. ఇలాంటి పరిస్ధితుల్లో కనీసం వ్యక్తిగత రక్షణ పరికరాలు, నాణ్యమైన మాస్కులు సరఫరా చేయకపోవడంతో ఇప్పుడు డాక్టర్లు సైతం రోగులతో సమానంగా భయపడాల్సిన పరిస్ధితులు నెలకొంటున్నాయి. దీంతో డాక్టర్లు ఆస్పత్రులకు వెళ్లాలంటేనే బెంబేలెత్తున్నారు. సాధ్యమైనంతగా రోగులకు దూరంగా ఉంటూనే విధులు నిర్వర్తిస్తున్నారు.

వెళ్లకపోతే అధికారులు చర్యలు తీసుకుంటారన్న భయం..
వ్యక్తిగత రక్షణ పరికరాలు అందుబాటులో లేని కారణంగా విధుల్లోకి వెళ్లని డాక్టర్లు, నర్సులు, ఇతర సహాయక సిబ్బందికి అధికారుల నుంచి ఒత్తిడి కూడా పెరుగుతోంది. పరిస్ధితిని అర్దం చేసుకుని విధుల్లోకి రావాల్సిందేనని ఉన్నతాధికారుల నుంచి హెచ్చరికలు అందుతున్నాయి. మాట వినకుంటే సస్పెండ్ చేస్తామన్న బెదిరింపులూ కొన్నిచోట్ల తప్పడం లేదు. దీంతో వ్యక్తిగత రక్షణ పరికరాలు లేకుండా ఎలా విధులు నిర్వర్తించాలని పలుచోట్ల వైద్య సిబ్బంది ప్రశ్నిస్తున్న పరిస్దితులు కనిపిస్తున్నాయి. కానీ మరికొన్ని రోజులు ఆగితే తప్ప వీటి కొరత తీరేలా లేదు.












Click it and Unblock the Notifications