ఏపీలో డ్రగ్స్ దుమారం : టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్రకు కాకినాడ పోలీసుల నోటీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారం పెద్ద దుమారంగా మారింది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఇక తాజాగా టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కు కాకినాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. డ్రగ్స్ వ్యవహారంలో టిడిపి సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర చేసిన ఆరోపణలకు, ఏపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పోలీసులు కోరారు.
ఏపీ డ్రగ్స్ వ్యవహారంలో పోలీసులు, ప్రభుత్వంపై ధూళిపాళ్ళ ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయి ఎగుమతులకు కేంద్రంగా మారుతుందని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో పోలీసులు కూడా డ్రగ్స్ విషయంలో తప్పుడు ప్రకటనలు చేస్తున్నారంటూ ధూళిపాళ్ల నరేంద్ర పోలీసులను టార్గెట్ చేస్తూ అభిప్రాయం వ్యక్తం చేశారు. వైసిపి నాయకులను కాపాడడం కోసం డీజీపీ గౌతమ్ సవాంగ్, విజయవాడ సిపి తప్పుడు ప్రకటనలు చేశారని ధూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన డిజిపి హెరాయిన్ విషయంలో వైసీపీ నాయకులను కాపాడటం పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
ధూళిపాళ్ళ నరేంద్రకు నోటీసులిచ్చిన పోలీసులు
ఏపీలో గంజాయి సాగులో వైసీపీ నేతల హస్తం ఉందని, ఓ పెద్ద మాఫియా ఏపీలో నడుస్తోందని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగుతున్న గంజాయి స్మగ్లింగ్ పై, డ్రగ్స్ దందా పై ఆయన తనదైన శైలిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే ధూళిపాళ్ళ నరేంద్రకు కాకినాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు. డ్రగ్స్ రవాణా వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలని నోటీసులలో పేర్కొన్నారు. ఈరోజు ఉదయం నరేంద్ర స్వగ్రామం గుంటూరు జిల్లా చింతలపూడి లోని ఆయన ఇంటికి వచ్చి నోటీసులు అందజేశారు పోలీసులు. విచారణకు హాజరై ఆధారాలు ఇవ్వాలని, ధూళిపాళ్ళ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసుల ద్వారా కోరారు.
ఏపీలో డ్రగ్స్ వ్యవహారంపై నిత్యం టీడీపీ నేతల విమర్శలు .. వారికీ నోటీసులిస్తారా?
ఒక్క దూళిపాళ్ల నరేంద్ర మాత్రమే కాకుండా, తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది ఏపీలో డ్రగ్స్ వ్యవహారంపై నిత్యం మాట్లాడుతున్నారు. డ్రగ్స్ దందా వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని, సీఎం జగన్ కనుసన్నల్లోనే డ్రగ్స్ వ్యవహారం కొనసాగుతుందని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇక పోలీసులకు ఈ దందా గురించి తెలుసని, వారి సహకారం కూడా ఉందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా దూళిపాళ్ల నరేంద్ర కు నోటీసులు జారీ చేసిన పోలీసులు, ఈ వ్యవహారంలో మరెంతమంది టిడిపి నేతలకు నోటీసులు జారీ చేస్తారో అన్నది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
Recommended Video
ధూళిపాళ్ళకు నోటీసులతో డ్రగ్స్ వ్యవహారంపై చర్చ
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని, విజయసాయి రెడ్డిని టార్గెట్ చేస్తూ డ్రగ్స్ కు లింకులు ఉన్నాయని టిడిపి నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని వైసీపీ నేతలు ఎదురు దాడి చేస్తున్నారు. కానీ ఏపీ డ్రగ్స్ వ్యవహారంపై పదేపదే ప్రశ్నలను సంధిస్తూ టిడిపి నేతలు ఇదే అంశాన్ని ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులు ఇవ్వడంతో ఈ వ్యవహారం ఏ రూపు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.