జగన్ సర్కార్ కు ఉద్యోగుల డెడ్ లైన్-రేపటిలోగా పీఆర్సీ ప్రకటించకపోతే-భవిష్యత్ కార్యాచరణ
ఏపీలో ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఉద్యోగులు మండిపడుతున్నారు. ముఖ్యంగా తాము కోరుతున్న పీఆర్సీ విషయంలో కనీసం నివేదిక కూడా ఇవ్వకుండా ఆలస్యం చేయడంపై ఆగ్రహంగా ఉన్న ఉద్యోగులు.. రేపటిలోగా నివేదిక ఇచ్చి తీరాలని సర్కార్ కు డెడ్ లైన్ పెట్టారు. బుధవారం లోగా నివేదిక ఇవ్వకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా వారు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
ఉద్యోగులకు జగన్ హామీలు
ఏపీలో ఉద్యోగుల సమస్యలను పాదయాత్రలో ప్రత్యక్షంగా చూసి కరిగిపోయిన వైఎస్ జగన్.. తాము అధికారంలోకి రాగానే సీపీఎస్ విధానం రద్దు చేస్తామని, పీఆర్సీ ప్రకటిస్తామని, ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామని హామీలు ఇచ్చారు. దీంతో ఉద్యోగులు గంపగుత్తగా చంద్రబాబును కాదని జగన్ కు ఓటేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే తమ సమస్యలన్నీ ఒక్క దెబ్బతో పరిష్కారం అవుతాయని గంపెడాశలు పెట్టుకున్నారు. అనుకున్నట్లుగానే అధికారం చేపట్టగానే జగన్ ఉద్యోగులతో సమావేశమై మీ సమస్యలన్నీ ప్రభుత్వం పరిష్కరిస్తుందని మరోమారు హామీ ఇచ్చారు.
రెండేళ్లయినా నెరవేరని హామీలు
ఉద్యోగులకు భారీ ఎత్తున హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న వైసీపీకి ఆ తర్వాత మాత్రం ఉద్యోగులు కనిపించడం లేదు. గతంలో ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ ఇప్పటివరకూ నెరవేర్చలేదు. అడిగితే రేపు, మాపు అంటూ కాలం గడిపేయడం రివాజుగా మారిపోయింది. చివరికి అధికారంలోకి వస్తే వారం రోజుల్లో రద్దు చేస్తామన్న సీపీఎస్ ఇంకా కొనసాగుతుండగా.. పీఆర్సీ అమలుపై ఉద్యోగులు ఆశలు వదులుకోవాల్సిన పరిస్ధితి వచ్చింది. గత నెలలో ఉద్యోగుల పోరుతో నెల రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామని ప్రభుత్వం తరఫున సలహాదారు సజ్జల ప్రకటనలు చేసినా అవి కూడా అమలు కావడం లేదు.
జీతాలు, పెన్షన్లకూ ఎదురుచూపులు
గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతం, పెన్షన్ రెండూ ఒకటో తేదీన కచ్చితంగా అందుతాయన్న ధీమా ఉండేది. కానీ తొలిసారిగా వైసీపీ ప్రభుత్వంలో ఆ ధీమా కరిగిపోయింది. ప్రభుత్వం లెక్కకు మిక్కిలిగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇప్పుడు ఉద్యోగుల పాలిట గుడిబండగా మారిపోయాయి. అదేమని అడిగితే పేదల పెన్షన్లతో లింక్ చేసి ఆర్ధికమంత్రి బుగ్గన సైటైర్లు వేస్తున్నారు.
రెండ్రోజులు ఆగలేరా అని అడుగుతున్నారు. దీంతో ఉద్యోగుల్లో అసహనం పెరుగుతోంది. దీంతో పీఆర్సీ, సీపీఎస్ రద్దు సహా ప్రతీ డిమాండ్ పై ప్రభుత్వాన్ని నిలదీయక తప్పని పరిస్ధితులు ఎదురవుతున్నాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
పీఆర్సీ నివేదిక కూడా ఆలస్యం
పీఆర్సీ ఎప్పుడొస్తుందో తెలియదు, కనీసం నివేదిక అయినా అందితే దాన్ని అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచొచ్చని భావించిన ఉద్యోగులకు ఆ విషయంలోనూ ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. పీఆర్సీ నివేదిక ఇచ్చేస్తామంటూ ప్రతీ రోజూ లీకులు ఇస్తుండటంతో ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నిన్న ఎట్టి పరిస్ధితుల్లోనూ నివేదిక ఇచ్చేస్తారంటూ చేసిన ప్రచారం కూడా ఒట్టిదేనని తేలిపోయింది దీంతో ఉద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. పీఆర్సీ నివేదిక కూడా ఇప్పించలేని పరిస్ధితుల్లో ప్రభుత్వం ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Recommended Video
జగన్ సర్కార్ కు ఉద్యోగుల డెడ్ లైన్
రెండ్రోజుల్లో పీఆర్సీ నివేదిక ఇస్తామని గతంలో సీఎస్ హామీ ఇచ్చారని, కానీ సోమవారం కూడా ఈ నివేదిక ఇవ్వకపోవడం బాధ కలిగిస్తోందని ఏపీ ఎన్జీవోల నేత బండి శ్రీనివాసరావు ఆక్షేపించారు. తాము ప్రతి రోజూ తిరగడమే సరిపోతుంది కానీ.. ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. బుధవారమైనా పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఇస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.
అయితే అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మరో అడుగు ముందుకేసి బుధవారం నివేదిక ఇవ్వకపోతే మాత్రం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాల్సి వస్తుందని సర్కార్ కు డెడ్ లైన్ పెట్టారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వ తీరుతో ఉద్యోగులు మానసిక క్షోభకు గురవుతున్నారని, పీఆర్సీ విషయంలో ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోందని అధికారులు చెబుతున్నారని ఆయన తెలిపారు.
వారం రోజుల్లో పీఆర్సీ అంశాన్ని తేల్చాలన్నారు. ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన కోట్లాది రూపాయల పెండింగ్ నిధుల విడుదలపై కార్యాచరణ ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. 2018 జూలై 1 నుంచి పీఆర్సీని అమలు చేయాలని, ఈ తేదీకి ఒక్క రోజు తక్కువైనా మేం ఒప్పుకోబోమన్నారు. అలాగే 60 శాతం మేర పీఆర్సీ ప్రకటించాలనేది తమ డిమాండ్ అన్నారు.