నాని వ్యాఖ్యలతో ఇబ్బందులు-టైం ఇస్తే బాధలు చెప్పుకుంటాం-సర్కార్ కు థియేటర్లు, డిస్టిబ్యూటర్లు
ఏపీలో సినిమా టికెట్ల రగడ కొనసాగుతూనే ఉంది. టికెట్ ధరల్ని తగ్గించాలంటూ జీవో ఇచ్చిన ప్రభుత్వం .. దాన్ని అమలు చేయడం లేదనే కారణంతో థియేటర్లపై అధికారులతో దాడులు చేయిస్తోంది. ఈ నేపథ్యంలో థియేటర్ల యజమానులు, డిస్టిబ్యూటర్లు ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమయ్యారు. రేపు సచివాలయంలో మంత్రి పేర్నినానిని వీరు కలిసే అవకాశముంది. సినిమా టికెట్లపై ప్రభుత్వ తుది వైఖరి ఇందులో తేలే అవకాశముంది.
ముదురుతున్న సినిమా టికెట్ల రచ్చ
ఏపీలో సినిమా టికెట్ల రచ్చ అంతకంతకూ ముదురుతోంది. ఇప్పటికే ప్రభుత్వం తాము గతంలో ఇచ్చిన టికెట్ల రేట్ల తగ్గింపు జీవోను హైకోర్టు కొట్టేసినా దాన్ని అమలు చేసి తీరాల్సిందేనని పట్టుబడుతోంది. దీనిపై హైకోర్టులో కేసు నడుస్తున్నా ప్రభుత్వం దూకుడు మాత్రం తగ్గడం లేదు. దీంతో థియేటర్లలో అధికారుల దాడులు యథేచ్చగా కొనసాగుతున్నాయి. వీటిపై బెంబేలెత్తుతున్న థియేటర్ల యజమానులు, డిస్టిబ్యూటర్లు ఆత్మరక్షణలో పడ్డారు. అటు టాలీవుడ్ పెద్దలు కూడా చర్చలకు సిద్ధం కాకపోవడంతో వీరిపై ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది.
ప్రభుత్వంతో చర్చలకు ప్రతిపాదన
సినిమా థియేటర్లలో టికెట్లు, ఇతర రేట్ల విషయమై ప్రభుత్వంతో చర్చలకు థియేటర్ యజమానులు, డిస్ట్రి బ్యూటర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు తమకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని సినిమాటోగ్రఫి మంత్రి పేర్నినానిని సినిమా థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు కోరారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు సమయం ఇవ్వాలని మంత్రి పేర్ని నానిని వారు కోరారు. దీంతో టాలీవుడ్ పెద్దల కంటే ముందే తాము ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
నాని వ్యాఖ్యలతో ఇబ్బందులు
తాజాగా ఏపీలో సినిమా టికెట్ రేట్ల తగ్గింపుపై హీరో నాని వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. సినిమా హాళ్ల కంటే పక్కన కిరాణా కొట్ల రెవెన్యూ ఎక్కువగా ఉంటోందన్నారు. దీనిపై సర్కార్ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేందుకు థియేటర్ యజమానులు, డిస్ట్రి బ్యూటర్లు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా సినిమా థియేటర్ల రేట్లపై పలువురు సినీ హీరోల వ్యాఖ్యలతో తాము ఇబ్బందులు పడుతోన్నట్లు థియేటర్ యజమానులు, డిస్ట్రి బ్యూటర్లు మంత్రి పేర్నినానికి తెలిపారు.
రేపు సెక్రటేరియట్ లో చర్చలు
టికెట్ రేట్లు, ఇతర వ్యవహారాల్లో నెలకొన్న ఇబ్బందుల నేపథ్యంలో ప్రభుత్వంతో చర్చలకు తామే వస్తామని, సమయం ఇవ్వాలని థియేటర్ల యజమానులు,డిస్ట్రిబ్యూటర్లు మంత్రి పేర్నినానిని కోరారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు మంత్రికి వారు తెలిపారు. దీంతో పేర్నినాని వారికి అపాయింట్ మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రేపు సచివాలయంలో మంత్రి పేర్ని నానిని కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు థియేటర్ యజమానులు,డిస్ట్రిబ్యూటర్లు సిద్ధమవుతున్నారు.