ఇబ్బందులున్నా జీతాలిస్తున్నాం, ఎవరు తప్పు చేసినా: బాబు హెచ్చరిక
అమరావతి: ఎవరు తప్పు చేసినా తాను ప్రజాపక్షమని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అన్నారు. గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల్లో సమూల మార్పులకు ప్రయత్నిస్తున్నామన్నారు.

ప్రతిపక్షాలు తప్పుడు విధానాలు అవలంభిస్తున్నాయని, వైయస్స్రార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల పైన ధ్వజమెత్తారు. పిరికితనంతో ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని హితవు పలికారు. కృష్ణా డెల్టాలో జూలై నుంచి పంటలు సాగుచేసేలా పట్టసీమ నీటిని అందిస్తామన్నారు.
ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇస్తోందన్నారు. స్వార్థం కోసం లిటిగేషన్లతో ప్రజలను ఇబ్బంది పెడితే క్షమించేది లేదని హెచ్చరించారు. కలెక్టర్ నుంచి దిగువస్థాయి వరకు బాధ్యతతో పని చేయాలన్నారు. ఎక్కడా అక్రమాలు లేకుండా టెక్నాలజీ వాడుతున్నామని చెప్పారు.

భూవివాదరహిత రాష్ట్రమే లక్ష్యంగా 'మీ ఇంటికి - మీ భూమి' అని చంద్రబాబు అన్నారు. ఆయన మీ ఇంటికి మీ భూమి రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గ్రామకంఠం గ్రామం భూముల సమస్యను పరిష్కరించామన్నారు.












Click it and Unblock the Notifications