అమెజాన్ నూ వదలని ఏపీ గంజాయి గుప్పు ... ఆన్ లైన్ దందా; షాకింగ్ నిజాలు చెప్పిన మధ్యప్రదేశ్ పోలీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయికి అడ్డాగా మారుతోందా?దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడిన దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంటున్నాయా? విశాఖ నుంచి భారీ నెట్వర్క్ గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతుందా? ఆన్లైన్ ద్వారా కూడా విక్రయాలు సాగించే స్థితికి ఏపీ గంజాయి చేరుకుంది అంటే సమస్య చాలా తీవ్రంగా ఉన్నట్టేనా? దేశవ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా పట్టుబడుతున్న గంజాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తరలించిన అక్రమ గంజాయి కావడం ఆందోళన కలిగిస్తుందా?అంటే అవుననే సమాధానమే వస్తోంది.
గంజాయి దందాకు కాదేదీ అనర్హం ..ఆన్ లైన్ ప్లాట్ ఫాం ద్వారా గంజాయి విక్రయాలు
కాదేది అక్రమ రవాణాకు అనర్హం అన్నట్టు తయారైంది గంజాయి మాఫియా పరిస్థితి. గంజాయి స్మగ్లర్లు రూటు మారుస్తున్నారు. గంజాయి స్మగ్లింగ్ చేయడానికి కొత్త దారులను వెతుకుతున్నారు. ఇప్పటికే కూరగాయల లారీలు, ఉల్లిగడ్డల లారీలు, బొగ్గు లారీలు, అంబులెన్స్ లు, ఆర్టీసీ బస్సులు, రైళ్లలో, గ్యాస్ సిలెండర్లు, అరటి గెలల మాటున ఇలా... గంజాయిని అక్రమంగా తరలిస్తున్న అక్రమార్కులు ఇప్పుడు ఏకంగా ఆన్ లైన్ ఫ్లాట్ ఫాం ద్వారా విక్రయాలు సాగిస్తున్నారు అన్న విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ను వదిలిపెట్టని గంజాయి గుప్పు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ ఏజెన్సీ గంజాయి గుప్పు దేశవ్యాప్తంగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా చేరుతుంది అన్న విషయం అందరినీ షాక్ కు గురి చేసింది. అసలేం జరిగిందంటే మధ్యప్రదేశ్ లో ఆన్లైన్లో గంజాయి విక్రయిస్తున్న ఒక రాకెట్ ను మధ్యప్రదేశ్ పోలీసులు పట్టుకున్నారు. వారు గంజాయిని విక్రయించడం కోసం ఆన్లైన్ ప్లాట్ ఫామ్ ను వినియోగిస్తున్నట్టు గుర్తించారు. ఓ దాబా కేంద్రంగా గంజాయి దందా జరుగుతుందని గుర్తించిన మధ్యప్రదేశ్లోని బింద్ పోలీసులు ఆ దాబాపై దాడి చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు.
మధ్యప్రదేశ్ లో ఇద్దరు గంజాయి స్మగ్లర్లను పట్టుకున్న పోలీసులు.. షాకింగ్ విషయాలు వెల్లడి
అరెస్టు చేసిన ఇద్దరు వ్యక్తుల నుండి 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆపై వారిని విచారించగా ఈ కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు గంజాయి దందా చెయ్యటానికి ఈ కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ ను వాడుకున్నారన్నది వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ ద్వారా గంజాయి రాకెట్ను నిర్వహిస్తున్నారని, అది ఉత్పత్తి చేయబడిన లాభాలలో మూడింట రెండు వంతులని పొందిందని పోలీసులు గుర్తించారు. ఆన్లైన్ ద్వారా గంజాయి దందా చేస్తున్న కల్లు పావయ్య (30), ఒక దాబా యజమాని బ్రిజేంద్ర తోమర్ (35)లను భింద్ గ్వాలియర్ రోడ్లో అరెస్టు చేసి 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు భింద్ పోలీసు సూపరింటెండెంట్ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు.
విశాఖ నుండి ఇతర రాష్ట్రాలకు గంజాయి ఈ కామర్స్ సైట్ ద్వారా రవాణా
కల్లు పావయ్య అనే నిందితుడు విశాఖపట్నం నుండి గ్వాలియర్, భోపాల్, కోట, ఆగ్రా మరియు దేశంలోని ఇతర ప్రాంతాలకు అంతర్జాతీయ ఈ-కామర్స్ సంస్థ ద్వారా గంజాయిని సరఫరా చేసేవాడు. బ్రిజేంద్ర అతనికి వ్యాపారంలో సహాయం చేసేవాడు అని భింద్ పోలీసు సూపరిండెంట్ మనోజ్ కుమార్ సింగ్ వెల్లడించారు.కల్లు పావయ్య ఇప్పటివరకు ఒక టన్ను నిషిద్ధ గంజాయిని విక్రయించి రూ.1.1 కోట్ల వ్యాపారం చేసినట్లు ఎస్పీ తెలిపారు. కల్లు పావయ్య తన కంపెనీని హెర్బల్ ప్రొడక్ట్స్ పేరుతో పాన్ మరియు జిఎస్టి నంబర్తో నకిలీ పేరుతో నడిపాడని పేర్కొన్నారు.
విశాఖ నుండి ఇప్పటికి టన్ను గంజాయి రవాణా
ఏపీ లోని విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి స్మగ్లర్లు ఈ-కామర్స్, కొరియర్ సంస్థల ద్వారా గంజాయిని భోపాల్, కోట, ఆగ్రా నగరాలకు తరలిస్తున్నారని ఎస్పీ వెల్లడించారు. అమెజాన్ డెలివరీ యాప్ నుంచి దాదాపు 1. 10 కోట్లకు పైగా విలువ చేసే గంజాయిని వారు విక్రయించినట్లుగా తెలిపారు. అనేక దఫాలుగా వీరు విశాఖ నుండి సుమారు టన్ను గంజాయిని అక్రమంగా మధ్యప్రదేశ్ కు తరలించినట్టు పేర్కొన్నారు. పోలీసుల నుండి తప్పించుకోవడం కోసమే నిందితులు ఈ చర్యకు పాల్పడ్డారని ఎస్పీ పేర్కొన్నారు.
గంజాయి అక్రమ వ్యాపారంతో లాభపడిన అమెజాన్ ... నోటీసులు జారీ, స్పందించిన అమెజాన్
గంజాయి విక్రయాలతో ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ అక్రమ వ్యాపారం నుండి 66.66 శాతం లాభం పొందిందని ఈ కామర్స్ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. అయితే అమెజాన్ ద్వారా జరుగుతున్న ఈ గంజాయి అక్రమ రవాణా అమెజాన్ సంస్థ కు తెలియకుండానే జరుగుతుందా అన్నదానిపై దృష్టిసారించిన పోలీసులు అమెజాన్ సంస్థ కు నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారంపై వివరణ కోరుతూ అమెజాన్ సంస్థ కు సమన్లు జారీ చేయడంతో, స్పందించిన సంస్థ వ్యవహారంపై అంతర్గత దర్యాప్తుకు ఆదేశించామని దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని, అలాగే విచారణ అధికారులకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడించారు.
మధ్యప్రదేశ్ లోనూ మారుమ్రోగుతున్న ఆంధ్రా గంజాయి పేరు
ఏది ఏమైనా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి గంజాయి ఇతర రాష్ట్రాలకు ఎంతమేర అక్రమ రవాణా జరుగుతుంది అంటే అది లెక్కించడానికి వీలులేనంత అన్న భావన తాజా ఆన్ లైన్ దందాతో కలుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ గంజాయి గుప్పు ఆన్లైన్ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా తయారైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఆన్లైన్ విక్రయాలతో, గంజాయి స్మగ్లర్లు మరే ఇతర రూట్లలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. తాజా కేసుతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ ఆంధ్ర గంజాయి పేరు మారుమ్రోగుతోంది.