ఆ రూ.40 వేల కోట్లపై ఏపీ సర్కార్ వివరణ- అక్రమాల్లేవ్-సర్దుబాట్ల వల్లే
ఏపీలో ట్రెజరీల ద్వారా జరగాల్సిన రూ.40 వేల కోట్ల చెల్లింపుల్ని నిబంధనలకు విరుద్ధంగా సీఎఫ్ఎమ్ఎస్ విధానంలో చేశారంటూ నిన్న ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మీడియాలో కూడా వార్తలు రావడంతో ప్రభుత్వం దీనిపై వివరణ ఇచ్చింది. ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ దీనిపై వివరణ ఇచ్చారు.
ప్రతీ ఏటా ప్రభుత్వ పద్దుల్ని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తయారు చేస్తారని, అందులో ఏవైనా లోపాలు గుర్తిస్తే వాటిని తిరిగి ఆర్ధికశాఖ దృష్టికి తీసుకెళ్లారని, ప్రభుత్వం నుంచి సరైన వివరణ లభిస్తే అభియోగాలు ఉపసంహరించడం సాధారణ జరిగే ప్రక్రియ అని ప్రభుత్వం తెలిపింది. ఇదే కోవలో 2020-21 ఆర్ధిక సంవత్సరానికి తయారు చేసిన పద్దుల్లో రూ.41,403 కోట్ల విలువైన 10806 బిల్లులపై ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ అభ్యంతరాలు వ్యక్తం చేశారని ప్రభుత్వం పేర్కొంది. ఈ బిల్లులకు విడిగా కోడింగ్ ఇవ్వకుండా ప్రత్యేక బిల్లుల కేటగిరీలో డ్రా చేశారని ప్రభుత్వం తెలిపింది.
Recommended Video
ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ లేవనెత్తిన అభ్యంతరాల్ని పరిశీలించిందని, ఇందులో ఈ విషయాలు బయటపడినట్లు ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్ వెల్లడించారు. ఇందులో పీడీ ఖాతాలకు మళ్లించిన నిధులు ఖర్చుచేయకపోవడంతో అవి మురిగిపోయాయని, దీంతో పీడీ ఖాతాల్లోనే సర్దుబాటు చేశారని పేర్కొన్నారు. పూర్తి కాని చెల్లింపులు తిరిగి చేపట్టారని, రెగ్యులర్ బిల్లుల ద్వారా వచ్చిన టీడీఎస్ మొత్తాన్ని జీఎస్టీ ఖాతాకు మళ్లించామని తెలిపారు. ఈ లావాదేవీలన్నీ నిబంధనలకు అనుగుణంగానే చేసినట్లు ఆయన వెల్లడించారు.