AP Rains: ఏపీలో కుండపోత-గోదావరికి భారీ వరద-సర్కార్ హెచ్చరికలు..!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. అన్ని ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అధికరుల్ని అప్రమత్తం చేస్తోంది. సీఎం చంద్రబాబు నిన్న రాత్రి కలెక్టర్లు, ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించగా.. హోంమంత్రి అనిత ఉదయం రివ్యూ చేశారు. అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
రాష్ట్రంలో నిన్నటి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరిలో వరద ప్రవాహం అమాంతం పెరుగుతోంది. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజ్ వద్ద 10 అడుగులకు పైగా వరద నీరు చేరుతోంది. దీంతో సముద్రంలోకి 3.5 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా వరద ప్రవాహం పెరుగుతోంది. ఉదయం స్పెల్ వే వద్ద 28.8 మీటర్ల నీటి మట్టం ఉంది. ప్రాజెక్టులోకి 3.27 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో 3 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని కిందకు వదిలేస్తున్నారు.

భారీ వర్షాలతో పశ్చిమగోదావరి నుంచి ఏజెన్సీ జిల్లాల్లో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఏజెన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. అలివేరు, జల్లేరు, బైనేరు, అశ్వరావుపేట వాగు,పడమటి వాగు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో సుమారు 20 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం శ్రీ గుబ్బల మంగమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు నిన్న వెళ్లిన భక్తులు రాత్రి నుండి ఎడతెరపి లేని వర్షాలు కురవడంతో భారీ వరదల్లో చిక్కుకున్నారు. నిన్న ఉదయం నుంచి అక్కడే ఉన్న భక్తులు, దుకాణదారులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా పోలీసులు, ఇతర అధికారులు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications