ఎట్టకేలకు ఏపీలో రోడ్డు రిపేర్లు- సరిపోని వడ్డన-రూ.2205 కోట్ల రుణాలకు గ్రీన్సిగ్నల్
ఏపీలో దారుణంగా దెబ్బతిన్న రహదారుల విషయంలో రెండేళ్లుగా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించింది. ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా ముందుకెళ్లింది. రోడ్ల అభివృద్ధికి పెట్రోల్పై రెండేళ్లుగా లీటరుకు రూ.2 రూపాయల చొప్పన సెస్ వసూలు చేస్తున్నా దాంతో రోడ్లను రిపేర్లు కూడా చేయించలేని దుస్ధితి. కానీ వరుస ఎన్నికలు పూర్తి చేసుకున్న ప్రభుత్వం ఇప్పుడు రోడ్ల రిపేర్లకు ఇవాళ పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. రూ.2205 కోట్ల బ్యాంకు రుణాలు తీసుకుని రోడ్లు రిపేర్లు చేసేందుకు ఆర్డీసీకి అనుమతి ఇచ్చింది.
రాష్ట్రంలో రహదారులపై నరకయాతన
రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా రహదారుల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. అదే సమయంలో దెబ్బతిన్న రహదారులను తాత్కాలికంగా అయినా మరమ్మత్తులు చేసేందుకు సిద్దం కాలేదు. సంక్షేమ జాతర నేపథ్యంలో రహదారుల కోసం వేల కోట్లు కేటాయించడం ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. దీంతో రెండేళ్లుగా జనం రోడ్లపై నరక యాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వానికి ఇదే విషయంపై స్ధానిక ప్రజాప్ర్తతినిధులు, మంత్రులు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. దీంతో గత ఏడాది కాలంలోనే వందల సంఖ్యలో రహదారి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
రోడ్ల కోసమంటూ పెట్రోల్పై లీటరుకు రూ.2 సెస్
రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ కోసం పెట్రోల్పై లీటరుకు రెండు రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా సెస్ వసూలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వసూలు చేస్తున్న సెస్ మొత్తం చూస్తే నెలకు రూ.50 కోట్ల చొప్పన ప్రభుత్వ ఖజానాకు చేరుతోంది. ఈ లెక్కన ఏడాదికి రూ.600 కోట్లను ప్రభుత్వం వెనకేస్తోంది. అయితే ఇందులో రూపాయి కూడా రోడ్ల కోసం ఖర్చుపెట్టిన పాపాన పోలేదు. దీనికి ప్రధాన కారణం గతంలో తీసుకున్న రుణాలకు చెల్లిస్తున్న వడ్డీనే. వసూలవుతున్న రూ.600 కోట్లలో రుణాలకు వడ్డీ కోసమే రూ.450 కోట్లు చెల్లించాల్సిన పరిస్ధితి. మిగిలిన రూ.50 కోట్లతో ఓ పట్టణంలో రోడ్లు కూడా పూర్తిగా నిర్వహించలేని దుస్ధితి.
రోడ్లపై ఎట్టకేలకు కదిలిన జగన్ సర్కార్
ప్రజల నుంచి వస్తున్న విమర్శలో, ప్రజాప్రతినిధుల ఫిర్యాదుల ఫలితమో తెలియదు కానీ ప్రభుత్వం ఇవాళ రోడ్ల రిపేర్లపై కదిలింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దెబ్బతిన్న రహదారులను మరమ్మత్తులు చేయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇందుకు తగిన మొత్తం ఖజానాలో లేకపోవడంతో అప్పులకు వెళ్లాలని నిర్ణయించింది. రోడ్ల నిర్వహణ బాధ్యత చూడాల్సిన రోడ్డు అభివృద్ధి కార్పోరేషన్ ఆర్డీసీ ద్వారా బ్యాంకు రుణాలు తీసుకుని దెబ్బతిన్న రోడ్లకు మరమ్మత్తులు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నిధులు అప్పుగా తీసుకునేందుకు పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది.
రూ.2205 కోట్లతో 7969 కిలోమీటర్ల మేర రోడ్డు రిపేర్లు
ఏపీలో దారుణంగా దెబ్బతిన్న రహదారులను రిపేర్ల కోసం గుర్తించారు. మొత్తం 7969 కిలోమీటర్ల మేర రహదారులకు రిపేర్లు చేయాలని నిర్ణయించారు. ఇందులో రాష్ట్ర రహదారులు 2726 కిలోమీటర్లు కాగా... జిల్లా రహదారులు 5243 కిలోమీటర్లు. వీటికి రిపేర్లు పూర్తి చేయాలంటే రూ.2205 కోట్లు అవసరమని తేల్చారు. ఈ మొత్తాన్ని బ్యాంకుల నుంచి రుణంగా తీసుకునేందుకు రోడ్డు అభివద్ధి కార్పోరేషన్కు పాలనాపరమైన అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకు రుణాలు త్వరగా మంజూరైతే రోడ్లు రిపేర్లు పూర్తి చేసేందుకు ప్రభుత్వానికి అవకాశం దొరుకుతుంది.