అమ్మఒడి, వసతి దీవెనకు బదులుగా ల్యాప్ టాప్ లు-అభ్యంతరాలకు 17వరకూ గడువు
ఏపీలో అమ్మఒడి, వసతి దీవెన పథకాలకు బదులుగా ల్యాప్ టాప్ ల పంపిణీకి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. విద్యార్ధులకు డబ్పుల కంటే ల్యాప్ టాప్ లు ఇస్తేనే మేలు జరుగుతుందని భావిస్తున్న ప్రభుత్వం... కోరుకున్న వారికి మాత్రమే దీన్ని వర్తింపజేయనుంది. దీనిపై అభ్యంతరాలను తెలపాలని ప్రభుత్వం లబ్దిదారుల్ని కోరుతోంది..
ఏపీలో జగనన్న అమ్మఒడి, వసతి దీవెన పథకాలకు బదులుగా రాష్ట్ర ప్రభుత్వం ల్యాప్టాప్లు పంపిణీ చేయనుంది. ఇందులో భాగంగా ల్యాప్టాప్ల కొనుగోలుకు టెండరు నోటీస్ జారీ చేయాలని నిర్ణయించింది. ల్యాప్టాప్ల కొనుగోలు టెండరు విలువ వంద కోట్ల రూపాయల పరిమితి దాటడంతో టెండరు నోటీసులోని అంశాలను న్యాయసమీక్షకు పంపించింది. న్యాయ సమీక్ష తర్వాత దీనిపై అభ్యంతరాలేవీ లేకపోతే పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నారు.
బేసిక్ కాన్ఫిగరేషన్తో 5.62 లక్షల ల్యాప్టాప్లు, ఆధునిక కాన్ఫిగరేషన్తో 90,926 ల్యాప్టాప్ల కొనుగోలుకు టెండర్లు పిలవనున్నారు. సరఫరా కోసం బిడ్లు దాఖలు చేయాల్సిందిగా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ కాంట్రాక్టర్లను కోరింది. దీనిపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు తెలియచేయాల్సిందిగా ప్రజలను కోరుతూ ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబరు 17 సాయంత్రం 5 గంటల్లోగా ఏపీజ్యూడీషియల్ ప్రివ్యూ ఎట్ జీమెయిల్ డాట్ కామ్కు ఈ అభ్యంతరాలు, సూచనలు సలహాలు పంపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఓసారి అభ్యంతరాలు పరిశీలించాక ల్యాప్ టాప్ లపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోబోతోంది. అప్పుడు దాఖలైన బిడ్లను పరిశీలించి ల్యాప్ టాప్ ల కొనుగోలుకు తుది ఆర్డర్ ఇవ్వబోతోంది. ల్యాప్ టాప్ ల పంపిణీ ద్వారా విద్యార్ధులకు మేలు జరుగుతుందని భావిస్తున్న ప్రభుత్వం ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించింది.
Recommended Video
ప్రతీ ఏటా అమ్మ ఒడి పథకాన్ని జనవరిలో అమలు చేస్తున్నందున ఆ లోపు డబ్బులు వద్దనుకునే వారికి ల్యాప్ టాప్ లు పంపిణీ చేయబోతున్నారు. తద్వారా ప్రభుత్వంపై ఆర్ధిక భారం కూడా తగ్గే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.డబ్బులే ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు భారం పెరుగుతోంది. ఆ మేరకు ఆర్ధిక వనరులు అందుబాటులో లేకపోవడంతో ల్యాప్ టాప్ ల పథకాన్ని అమల్లోకి తెస్తున్నట్లు తెలుస్తోంది.