రామయపట్నం పోర్ట్ కు లైన్ క్లియర్ .. కృష్ణపట్నం పోర్ట్ కు ప్రత్యేక పరిమితులు రద్దు చేసిన ఏపీ సర్కార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణపట్నం పోర్టు పరిధిని తగ్గిస్తూ రామాయపట్నం పోర్టు ఏర్పాటుకు వీలుగా ఉత్తర్వులిచ్చింది. కృష్ణపట్నం పోర్టు ముఖ పరిధిని తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రామయపట్నం పోర్టుకు లైన్ క్లియర్ అయ్యింది. కృష్ణపట్నం పోర్టు ఏర్పాటు సమయంలో...ఆ పోర్టుకు అటూ ఇటూ 30 కిలోమీటర్ల పరిధిలో మరో పోర్టు నిర్మాణానికి అవకాశం ఇవ్వొద్దనే అంశం ప్రధానంగా ఉంది .
కృష్ణపట్నం పోర్టు ప్రత్యేక పరిమితులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ
వైసీపీ సర్కార్ తాజాగా కృష్ణపట్నం పోర్టుకున్న ప్రత్యేక పరిమితులను రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రామాయపట్నం పోర్టు ప్రతిపాదనకు అవరోధాలు తొలగినట్టు భావించొచ్చు .గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కృష్ణపట్నం పోర్టుకు విశేష అధికారాలు కట్టబెట్టారని పోర్టు పరిధిలోని 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్తగా ఎటువంటి పోర్టు నిర్మాణం చేపట్టకూడదని వారు చేసుకున్న ఒప్పందంలో ప్రధాన క్లాజుగా ఉంది.
గత ప్రభుత్వ హయాంలో ఉత్తర్వుల్లో పరిమితి క్లాజ్
దీంతో అక్కడ వేరే పోర్టులు ఏర్పాటు కాకుండా కృష్టపట్నం పోర్టు కంపెనీకి నాటి టీడీపీ ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది అన్న ఆరోపణలు ఉన్నాయి .దీంతో తాజాగా ఆ ఒప్పందంలో ఉన్న క్లాజును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు కూడా ఇచ్చింది . ఇక ఈ పోర్టు వ్యవహారానికి వస్తే కృష్ణపట్నం పోర్టు నిర్మాణం సమయంలో ఆ పోర్టు పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి వచ్చిన తర్వాత 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇంకో పోర్టు ఇవ్వొచ్చని 1994లో ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే కృష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్ తప్ప మరో సంస్థకు 30 కిలోమీటర్ల పరిధిలోపు ఇంకో పోర్టు నిర్మించే హక్కు లేదంటూ 2004లో ఉత్తర్వులిచ్చారు. ఆ తర్వాత కూడా దీనికి సంబంధించి పలు మార్పులు చేస్తూ ఉత్తర్వులిచ్చారు.
కేంద్రం అభ్యంతరం .. ఏపీ సర్కార్ తొలగింపు
ఇక ఈ వ్యవహారంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలా ఒక సంస్థకు ప్రత్యేక హక్కులు కట్టబెడుతూ, ఇంకో పోర్టు నిర్మాణానికి హక్కులు లేకుండా చేసే హక్కులేదంటూ కేంద్రం గతంలో రాష్ట్రానికి లేఖ రాసింది. ఒకవేళ ఇలాంటి నిబంధన పెట్టినా అది చెల్లదని చాలా స్పష్టంగా చెప్పింది . ఈ నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టుకు అటూ ఇటూ 30 కిలోమీటర్ల పరిధిలో ఇంకో కొత్త పోర్టు నిర్మాణం కుదరదన్న షరతును రద్దు చేసింది ఏపీ సర్కార్ . ఈ ఉత్తర్వుల జారీతో రామాయపట్నం పోర్టు నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది.