అప్పుడు జగన్ కు ఇచ్చినవే..? ఇప్పుడు లోకేష్ కూ.. ఏపీ సర్కార్ క్లారిటీ ఇదే..!
ఏపీలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. దీని కోసం వైసీపీ సర్కార్ ఇచ్చిన అనుమతులపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ క్లారిటీ ఇచ్చింది.
ఏపీలో టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్రకు రంగం సిద్ధమవుతోంది. ఎల్లుండి చిత్తూరు జిల్లా కుప్పం నుంచి లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర మొదలుపెట్టబోతున్నారు. అదే రోజు కుప్పంలో బహిరంగసభకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పాదయాత్రతో పాటు బహిరంగసభకు పోలీసులు విధించిన ఆంక్షలపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ వీటిపై క్లారిటీ ఇచ్చింది.
లోకేష్ పాదయాత్రకు అనుమతి
నారా లోకేష్ ఎల్లుండి నుంచి చేపట్టే పాదయాత్రకు చిత్తూరు జిల్లా పోలీసులు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు. చిత్తూరు జిల్లాలో యాత్ర సాగినంతసేపు ఈ అనుమతులు పాటించాలని సూచించారు. ఇందులో పాదయాత్రకు 15 షరతులు, కుప్పంలో జరిగే బహిరంగసభకు 14 షరతులు విధించారు.
వీటిని ఉల్లంఘిస్తే పాదయాత్ర రద్దు చేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఈ అనుమతుల వ్యవహారం లోకేష్ ను టార్గెట్ చేసినట్లు ఉందనే చర్చ జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం ఇవాళ స్పష్టత ఇచ్చింది.
జగన్ సర్కార్ వివరణ
లోకేష్ పాదయాత్రకు ఇచ్చిన అనుమతులపై వస్తున్న విమర్శలపై జగన్ సర్కార్ ఇవాళ స్పందించింది. లోకేష్ పాదయాత్రకు అనుమతి ఇచ్చిన చిత్తూరు ఎస్పీ ఇవాళ దీనిపై వివరణ కూడా ఇచ్చారు. పాదయాత్రకు ఇచ్చిన అనుమతులకు అనుసరించిన మార్గదర్శకాలను వెల్లడించడంతో పాటు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని కూడా ఇందులో గుర్తుచేశారు.
అంతే కాదు గతంలో పాదయాత్రల సందర్భంగా అవే మార్గదర్శకాలను అమలు చేసినట్లు వెల్లడించారు.ఇప్పుడు లోకేష్ పాదయాత్రకు కూడా అవే నిబంధనలు విధించినట్లు ప్రభుత్వం విడుదల చేసిన వివరణలో పేర్కొంది.
అప్పుడు జగన్ కు ఇచ్చినవే..
గతంలో 2017లో విపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ పాదయాత్ర చేసేందుకు అనుమతి కోరినప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ అనుమతులు మంజూరు చేసింది. అప్పుడు రాష్ట్రంలో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే ఈ అనుమతులు ఇచ్చినట్లు ఇప్పుడు ప్రభుత్వం గుర్తుచేసింది. అప్పట్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ఆధారంగానే ఈ అనుమతులు ఇచ్చారని, ఇప్పుడు కూడా లోకేష్ కు అవే నిబంధనలతో అనుమతులు ఇచ్చినట్లు ప్రభుత్వం విడుదల చేసిన వివరణలో పేర్కొంది.
అప్పట్లో ఓ జిల్లాలో పాదయాత్ర పూర్తిచేసి మరో జిల్లాలోకి అడుగుపెడుతున్నప్పుడు జగన్ సదరు జిల్లా ఎస్పీ నుంచి అనుమతులు తీసుకున్నారని గుర్తుచేసింది.
రూల్ అందరికీ ఒకటే!
ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారం, ఇండియన్ పోలీస్ యాక్ట్ ప్రకారం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మాత్రమే లోకేష్ పాదయాత్రకు అనుమతి ఇచ్చామని, కొత్తగా ఏ ఒక్క నిబంధనా చేర్చలేదని ప్రభుత్వం వెల్లడించింది. అలాగే పాదయాత్రలు, బంద్ లు, హర్తాళ్లు, నిరసనలు చేసినప్పుడు పాటించాల్సిన నిబంధనలపై సుప్రీంకోర్టు ఓ సుమోటో కేసు విచారణ సందర్భంగా ఇచ్చిన తీర్పులో ఉన్నవే ఇప్పుడు అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.
అలాగే ఇవే నిబంధనలు అన్ని రాజకీయ పార్టీలకు సమానంగా వర్తిస్తాయని తెలిపింది. తమకు అన్ని పార్టీలు సమానమేనని, ప్రజల రక్షణ, శాంతి భద్రతల పర్యవేక్షణ పోలీసు యంత్రాంగం ప్రధాన విధి అని, ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఇవే రూల్స్ వర్తిస్తాయని చిత్తూరు ఎస్పీ పేరుతో వివరణ ఇచ్చారు.