Amaravati Capital: అమరావతిపై చంద్రబాబు మరో కీలక నిర్ణయం-కేంద్రం ప్రకటనతో..!
ఏపీ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు ఇస్తామని కేంద్రం నిన్న బడ్జెట్ లో ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో కూటమి సర్కార్ కూడా వేగంగా అడుగులేస్తోంది. రాజధానిలో పెండింగ్ పనులను గుర్తించేందుకు ఏడుగురు సభ్యులతో ఓ టెక్నికల్ కమిటీని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. నెల రోజుల్లో ఈ కమిటీ రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నివేదిక రాగానే తదుపరి అడుగులు పడనున్నాయి.
రాజధాని లో నిలిచిపోయిన పనులపై టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నిలిచిపోయిన పనులను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై కమిటీ సిఫార్సులు చేయబోతోంది. అమరావతి రాజదానిలో పర్యటించి అక్కడి సమస్యలను కూడా కమిటీ అధ్యయనం చేయనుంది. పబ్లిక్ హెల్త్ ఈఎన్ సీ ఛైర్మన్ గా మొత్తం ఏడుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో సభ్యులుగా ఆర్ అండ్ బీ , వీఎంసీ, ఏపీసీపీడీసీఎల్, ఏపీసీఆర్డీఏ,ఏడీసీఎల్ చీఫ్ ఇంజినీర్లు,విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ డిపార్ట్ మెంట్ నుంచి ఒక ప్రతినిధిని నియమించారు.

ఏపీసీఆర్డీఏలో పనులకు సీఆర్డీఏ సీఈ కన్వీనర్ గాను,ఏడీసీఎల్ పనులకు కన్వీనర్ గా ఏడీసీఎల్ సీఈని నియమించారు.మొత్తం 9 అంశాలపై ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. నెలరోజుల్లోగా కమిటీ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.రాజధాని నిర్మాణంలో పనుల ప్రస్తుత పరిస్థితిని సాంకేతిక కమిటీ అధ్యయనం చేయనుంది. మే 2019 నుంచి నిలిచిపోయిన వివిధ భవనాల పటిష్టతను కమిటీ అంచనా వేయనుంది. దీనికోసం గుర్తింపు పొందిన వారి సలహాలు తీసుకోనున్నారు.
రోడ్లు,డ్రైనేజీ,వాటర్ సప్లై కోసం వేసిన పైప్ లైన్లు,విద్యుత్,కమ్యూనికేషన్ పనులకు జరిగిన నష్టాన్ని కమిటీ అంచనా వేస్తుంది.రాజధాని లోని పలు ప్రాంతాల్లో మిగిలి ఉన్న మెటీరియల్ క్వాలిటీ పరిశీలన చేయడంతో పాటు పైప్ లు,ఇనుము,ఇతర మెటీరియల్ సేవా సామర్ధ్యం అంచనా వేయనుంది. అవసరమైన చోట తిరిగి పరికరాలు అమర్చడంపై పలు సూచనలు చేయనున్నారు. నిలిచిపోయిన అన్ని పనులపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై కమిటీ సిఫార్సులు చేయనుంది. నిలిచిపోయిన పనులు ఎక్కడి నుంచి ప్రారంభించాలనే దానిపై నిర్ధిష్టమైన సూచనలు చేయనున్నారు. వివిధ కాంట్రాక్ట్ సంస్థల నుంచి వచ్చే క్లెయిమ్ లను అధ్యయనం చేసి కమిటీ సిఫార్సులు చేయనుంది.












Click it and Unblock the Notifications