మందుబాబులకు గుడ్ న్యూస్- ఏపీలో 50 నుంచి 1350 వరకూ తగ్గిన బాటిల్ ధరలు
ఏపీలో గతేడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మందుబాబులకు చుక్కలు చూపిస్తున్న వైసీపీ సర్కారు తొలిసారిగా వారిపై కనికరం చూపింది. రాష్ట్రంలో వివిధ బ్రాండ్ల, బాటిళ్ల మద్యం ధరలను తగ్గిస్తూ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం కనీసం 50 రూపాయల నుంచి గరిష్టంగా 1350 రూపాయల వరకూ ధరలు తగ్గబోతున్నాయి. తగ్గించిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.
ఏపీలో మద్యం ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మద్యం షాపులను తన ఆధీనంలోకి తెచ్చుకోవడంతో పాటు అపరిచిత బ్రాండ్లను తీసుకొచ్చిన ప్రభుత్వం.. మద్యం షాపులను కూడా భారీగా తగ్గించింది. అదే సమయంలో భారీగా మద్యం ధరలు పెంచుకుంటూ పోయింది. మద్యం విక్రయాలను నిరుత్సాహపరిచే పేరుతో ధరలను భారీగా పెంచడంపై మందుబాబులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో ప్రభుత్వం ఈసారి వారికి ఊరటనిచ్చేలా ధరలను తగ్గించింది.
50 ఎంఎల్ నుంచి మొదలుపెట్టి 60 ఎంఎల్, 90 ఎంఎల్, 180ఎంఎల్, 200 ఎంఎల్, 700 ఎంఎల్, 750 ఎంఎల్, 1000 ఎంఎల్ అంతకు పైబడిన బ్రాండ్లు, బాటిళ్ల ధరలు రూ.200 కంటే తక్కువ ఉంటే అందులో ఎలాంటి మార్పు లేదు. రూ.200 రూపాయలు దాటిన వాటికి మాత్రం రూ.50 రూపాయల నుంచి తగ్గింపు చేపట్టారు. గరిష్టంగా 1000 ఎంఎల్, అంతకు పైబడిన బాటిళ్లకు వెయ్యి రూపాయలకు పైగా ధర ఉంటే అందులో 1350 వరకూ తగ్గబోతోంది. దీంతో మందుబాబులకు భారీగా ఊరట దక్కినట్లవుతుంది.