సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తోన్న ఏపీ ప్రభుత్వం?
ఏపీ ప్రభుత్వం మరోసారి కోర్టు ధిక్కరణకు పాల్పడే అవకాశం కనపడుతోంది. సుప్రీంకోర్టునే నేరుగా ఢీకొట్టే యోచనలో ఉన్నట్లుందని న్యాయనిపుణులు అంటున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. కోర్టు ఆదేశాలిచ్చి రెండు వారాలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. సుప్రీంకోర్టు ఆదేశాలను తీసుకొని ఏబీవీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని కలిశారు. ఆయన కలిసిన తర్వాత అధికారుల బదిలీలు జరిగాయి. అప్పుడు కూడా ఆయన పేరు పరిగణనలోకి తీసుకోలేదు. తనకు పోస్టింగ్ ఇవ్వడంతోపాటు పూర్తి వేతనం చెల్లించాలని ఏబీవీ కోరుతున్నారు.
ఏబీవీ వరుసగా రెండురోజులపాటు సచివాలయానికి వెళ్లారు. నిన్న వెళ్లినప్పుడు ఒకరోజు చీఫ్ సెక్రటరీ లేకపోతే ఈరోజుకూడా వెళ్లారు. గత ప్రభుత్వంలో ఇంటిలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో కక్షకట్టినట్లుగా వ్యవహరిస్తోందని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

దేశద్రోహం, రాజద్రోహం లాంటి తీవ్రమైన కేసులు పెట్టినప్పటికీ ఆధారాలు లేకపోవడంతో చివరికి చిన్న కేసులతో సరిపుచ్చింది. కానీ ఏబీవీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఏ బావ కళ్లల్లో ఆనందం చూడటం కోసం ఇదంతా చేశారో... ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. కానీ ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా తాత్సారం చేస్తోందంటే సుప్రీంకోర్టు తీర్పును కూడా లెక్కచేయని ధిక్కారం ఏపీ ప్రభుత్వ వ్యవహారశైలిలో కనపడుతోందని న్యాయనిపుణులు అంటున్నారు.












Click it and Unblock the Notifications