ఏపీలో పదో తేదీ వచ్చినా జీతాల్లేవ్-ఉద్యోగులు, పెన్షనర్ల గగ్గోలు-రెండురోజుల్లో ఇస్తామన్న బుగ్గన
ఏపీలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభం ప్రభావం క్రమంగా ఉద్యోగులు, పింఛనర్లపై పడుతోంది. గతంలో ఒకటో తేదీన ఠంచనుగా జీతాలు, పింఛన్లు అందుకునే ఉద్యోగులకు ఈసారి పదో తేదీ వచ్చినా ఇంకా పూర్తి స్ధాయిలో చెల్లింపులు జరగలేదు. దీంతో ఉద్యోగులు, పింఛనర్లు గగ్గోలు పెడుతున్నారు. ఏపీకీ గతంలో సీఎస్ గా పనిచేసిన ఒకాయన నిన్నటి వరకూ ఎదురుచూసి వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ లు పెట్టేవరకూ వ్యవహారం వెళ్లింది. చివరికి అది కాస్తా ప్రభుత్వం దృష్టికి రావడంతో ఆయనకు నిన్న సాయంత్రం జమ చేశారు.
ఏపీలో చెల్లింపుల సంక్షోభం
ఏపీలో ప్రభుత్వం ఆర్ధిక నిర్వహణలో చూపుతున్న నిర్లక్ష్యం ఉద్యోగులు, పింఛనర్ల పాలిట శాపంగా మారుతోంది. నెలంతా కష్టపడిన ఉద్యోగులు, దశాబ్దాల పాటు ప్రభుత్వానికి సేవలు అందించిన పింఛనర్లు సకాలంలో జీతాలు, పింఛన్లు అందుకోలేని పరిస్ధితి ఏర్పడుతోంది. కేంద్రం నుంచి వచ్చే నిధులు, గ్రాంట్లు సకాలంలో రాకపోవడం, ఏపీలో సంక్షేమం పేరిట సాగుతున్న విచ్చలవిడి పంపకాల జాతర అన్నీ కలగలిసి ఉద్యోగులు, పింఛనర్ల ఉసురుతీస్తున్నాయి.
ఎప్పటికప్పుడు అప్పులు పెరిగిపోతుండటం, వాటికి చెల్లించాల్సిన వడ్డీల భారం పెరిగిపోతుండటంతో ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్దితి దాపురించింది. దీంతో ఈ నెల రావాల్సిన జీతాలు, పింఛన్లు ఇంకా అందరికీ అందలేదు.
ఉద్యోగులు, పింఛనర్ల గగ్గోలు
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు నెలంతా కష్టపడి జీతం పడే రోజు కోసం ఎదురుచూస్తుంటారు. వారికి ప్రభుత్వం గతంలో ఠంచనుగా ప్రతీ నెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించేది. అలాగే ప్రభుత్వానికి సుదీర్గకాలం సేవలు అందించిన వారికి పింఛన్లు కూడా కచ్చితంగా ఒకటో తేదీనే పడేవి. కానీ కొంతకాలంగా ఆ పరిస్ధితి కనుమరుగైంది. ఒకటో తేదీ నుంచి ఐదో తేదీకి చేరిన చెల్లింపులు.. ఇప్పుడు ఏకంగా పదో తేదీకీ కూడా పూర్తి కాకపోవడంతో ఉద్యోగులు, పింఛనర్లు గగ్గోలు పెడుతున్నారు. వారికి ఇప్పుడు సమాధానం చెప్పేవారు కూడా లేకుండా పోయారు.
ఉద్యోగసంఘాలపై విమర్శల వెల్లువ
ప్రభుత్వం సకాలంలో ఉద్యోగులు, పింఛనర్లకు జీతాలు, పింఛన్లు ఇవ్వకపోయినా ఉద్యోగ సంఘాలు మాత్రం గట్టిగా నిలదీయలేని పరిస్ధితుల్లో ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వంతో అంటకాగుతున్న వీరంతా ప్రశ్నించడం మానేసి చాలా కాలమైంది. గతంలో ఉద్యోగ సంఘాలు జీతాలు, పింఛన్ల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు.
పీఆర్సీ, ఐఆర్, హెచ్చార్సీ, డీఏ వంటి విషయాలపై ప్రభుత్వంపై పోరాచాలు చేసేవారు. సమ్మెలకు సైతం సిద్ధపడే వారు. కానీ ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు. కొన్నేళ్లుగా ప్రభుత్వాల దయతో బతికేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలకు ఉద్యోగులు, పింఛనర్ల ఘోష పట్టడం లేదు. ఇప్పటికే డీఏ బకాయిలతో పాటు ఇతర భత్యాలు కూడా ఉద్యోగులు, పింఛనర్లకు ప్రభుత్వం భారీగా బకాయి పడింది. పీఆర్సీ గడుపు దాటి చాలా కాలమైంది. అయినా ఇప్పటికీ ప్రభుత్వం దాని ఊసెత్తకపోయినా ఉద్యోగసంఘాలు నోరు మెదపలేని పరిస్దితి ఉంది. దీంతో కనీస ధర్మం అయిన జీతాలు, పింఛన్ల కోసం కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచలేని పరిస్ధితి ఉంది.
Recommended Video
ఇంకో రెండు రోజులన్న బుగ్గన
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లందరికీ పూర్తిస్ధాయిలో జీతాలు, పింఛన్లు చెల్లించకపోవడంపై ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందించారు. ప్రస్తుతం కరోనాతో అందరికీ ఇబ్బందులు ఉన్నాయని, సంక్షేమ పథకాల ద్వారా ఎక్కువ మందికి లభ్ది జరుగుతుందని బదులిచ్చారు. తద్వారా సంక్షేమ పథకాల అమలు వల్లే జీతాలు, పింఛన్లు చెల్లించలేని పరిస్ధితి వచ్చిందని ఆయన పరోక్షంగా వెల్లడించారు. ఉద్యోగుల జీతాలు, పింఛన్ల బకాయిలు మరో రెండు రోజుల్లో సర్దుబాటు చేస్తామని బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు.