Fact Check : ఏపీలో ఆర్టీసీ ఛార్జీలు పెరగనున్నాయా ? ఇదీ వాస్తవం...
ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలుగా బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇప్పుడు వాటిని తిరిగి ప్రారంభించేందుకు ఉన్న అవకాశాలపై ప్రస్తుతం అధికారులతో చర్చలు జరుపుతోంది.
తొలుత విజయనగరం జిల్లా గ్రీన్ జోన్ గా ఉన్నందున అక్కడ సర్వీసులు పునరుద్ధరించాలని భావించినా... ఒక్క జిల్లాలోనే సర్వీసులు నడిపితే ఇబ్బందులు ఉంటాయని భావించింది. ఆలోపే విజయనగరం జిల్లాలో మూడు కరోనా కేసులు రావడంతో ఆ ప్రతిపాదన ఉపసంహరించుకుంది.
విశాఖ గ్యాస్ ప్రభావంతో స్పృహ కోల్పోయిన రైలు డ్రైవర్, గార్డ్.. వాల్తేర్ డివిజన్లో రైళ్లన్నీ రద్దు...
దేశవ్యాప్తంగా ప్రజా రవాణా పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తున్న నేపథ్యంలో ఏపీలనూ బస్సు సర్వీసుల పునరుద్దరణ ప్రారంభం కానుంది. అయితే బస్సులు తిరిగి ప్రారంభమయ్యాక ఛార్జీల బాదుడు తప్పదనే వార్తలు ప్రయాణికులను కలవరపెడుతున్నాయి.
సామాజిక మాధ్యమాల్లోనూ దీనిపై విస్తృతంగా ప్రచారం సాగుతుండటంతో ప్రజా రవాణాశాఖ అధికారులు స్పందించారు. లాక్ డౌన్ తర్వాత ఏపీఎస్ఆర్టీసీ బస్సుఛార్జీలు పెరుగుతాయన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపాయి. ఇప్పటి వరకూ ఛార్జీలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, దీనిపై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి. దీంతో ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపు ప్రచారానికి ఫుల్ స్టాఫ్ పడినట్లయింది.