AP Volunteers: వాలంటీర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్- మంత్రి కీలక ప్రకటన..!
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ తొలగిస్తారంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఇవాళ కూటమి సర్కార్ స్పందించింది. వాలంటీర్ల వాట్సాప్ గ్రూపుల్ని తొలగించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో ఇక వాలంటీర్ల వ్యవస్థకు కూటమి సర్కార్ మంగళం పాడేస్తుందంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంపై స్పందిస్తూ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఇవాళ ఓ ప్రకటన చేసారు. ఇందులో వాలంటీర్లకు ఎలాంటి అపోహలు వద్దని స్పష్టం చేశారు.
వాలంటీర్ల వ్యవస్థపై టీడీపీ ఇచ్చిన మాటకు కట్టుబడే ఉందని సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థను ఎన్డీయే ప్రభుత్వం రద్దు చేయనున్నట్టు ప్రచారంలోకి వస్తున్న కథనాలను ఆయన ఖండించారు. వాలంటీర్ల భవిష్యత్ విషయంలో ఎన్డీయే ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఎన్నికలలో ఇచ్చిన ఉద్యోగ భద్రత హామీ, మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాల విషయంలో తెలుగుదేశం పార్టీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు.

వాలంటీర్లు తమ భవిష్యత్పట్ల ఎలాంటి భయాందోళనలకూ గురికావాల్సిన అవసరం లేదని మంత్రి స్వామి తెలిపారు. భయాందోళనలకు గురిచేసే ఎలాంటి తప్పుడు కథనాలనూ వాలంటీర్లు నమ్మవద్దని కోరారు. కుట్రపూరిత కథనాలతో ఎన్డీయే ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేసే దుష్ట చర్యలను ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ సేవల ముసుగువేసి.. వాలంటీర్ వ్యవస్థను రాజకీయంగా వాడుకున్నది వైసీపీ పాలకులేనని విమర్శించారు.
ఏడాది కాలంగా వాలంటీర్ సేవలను రెన్యువల్ చేయకుండా దగా చేసిన వైసీపీ.. ఇప్పుడు వాలంటీర్ల భవిష్యత్నూ దెబ్బకొట్టేందుకు నిరాధార, కుట్రపూరిత కథనాలను ప్రచారంలోకి తేవడం దుర్మార్గ చర్యగా మంత్రి అభివర్ణించారు. ఎన్నికల సమయంలో వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాలంటీర్లచేత బలవంతంగా రాజీనామాలు చేయించి దగా చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు అనేక విధాలుగా వాలంటీర్ వ్యవస్థకు హామీలిచ్చినా, వైసీపీ పాలకులు మాయచేసి, రెచ్చగొట్టి రాజీనామాలు చేయించి.. వాలంటీర్ల భవిష్యత్ను అయోమయంలోకి నెట్టడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు.












Click it and Unblock the Notifications