ఏపీలో రైతులకు గుడ్ న్యూస్-నివర్ తుపాను సాయం విడుదల
ఏపీలో గత నెలలో వచ్చిన నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు సర్కారు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు తిరిగి పంటలు వేసుకునేందుకు వీలుగా ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఈ సాయం రైతులకు అందబోతోంది.
నివర్ తుపాను కారణంగా రాష్ట్రంలో పంటలు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పాలనా అనుమతి జారీ చేసింది. దీంతో రూ. 601.66 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ మొత్తం విడుదల కానుంది. శ్రీకాకుళం మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రభుత్వం ఇవాళ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలోని 7 లక్షల 82 వేల 649 మంది రైతులకు నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం లెక్క తేల్చింది. మొత్తంగా 4 లక్షల 59 వేల 608 హెక్టార్లలోని పంట దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ వెల్లడించింది.
ఇవాళ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో ఉద్యాన పంటలు నష్ట పోయిన రైతులకు 44.33 కోట్ల రూపాయల మేర ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తారు. ఈ తుపాను కారణంగా రాష్ట్రంలో కడప, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో 26, 731 హెక్టార్లలోని ఉద్యాన పంటలకు నష్టం జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది మొత్తం 51, 527 మంది ఉద్యాన రైతులకు 44.33 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ప్రభుత్వం చెల్లిస్తుంది. పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లోకి నేరుగా ఈ మొత్తం జమ చేస్తారు.