గుంటూరు ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి పరిధిలోకి వచ్చే ప్రాంతాలకు రోజుకో గుడ్ న్యూస్ అందుతూనే ఉంది. ఇదే క్రమంలో తాజాగా ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. అమరావతి పరిధిలో ప్రజా రవాణాను మరింత సులభతరం చేసే లక్ష్యంతో ప్రభుత్వం కొత్తగా ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తోంది. త్వరలో వీటిని గుంటూరు డిపోకు అందజేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సుల వాడకాన్ని మరింతగా పెంచాలని భావిస్తున్న ప్రభుత్వం.. ఇందులో భాగంగా త్వరలో గుంటూరు ఆర్టీసీ డిపోకు 100 బస్సుల్ని కేటాయించాలని నిర్ణయించింది. ఇందులో 20 బస్సులు అల్ట్రా డీలక్స్ సర్వీసులుగా నడుస్తాయి. మిగతా బస్సులన్ని పల్లెవెలుగు బస్సుల కింద తిప్పుతారు. గుంటూరు నుంచి విజయవాడకు 20 బస్సులు, గుంటూరు నుంచి పొన్నూరుకు 15 బస్సులు, గుంటూరు నుంచి తెనాలికి 30 బస్సులు నడుస్తాయి.

అలాగే గుంటూరు నుంచి హైకోర్టుకు 5 బస్సులు, గుంటూరు నుంచి సచివాలయానికి 5 బస్సులు, గుంటూరు నుంచి చిలకలూరిపేటకు 10 బస్సులు, గుంటూరు నుంచి సత్తెనపల్లికి 15 బస్సులు నడుపుతారు. వీటిని ఒకసారి ఛార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్లు నడుస్తాయని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి 100 కిలోమీటర్ల లోపు దూరం ఉన్న ప్రాంతాలకే వీటిని ఉపయోగిస్తారు. వీటికి ఛార్జింగ్ స్టేషన్ ను పెదకాకాని బస్టాండ్ వెనక ఆర్టీసీకి ఉన్న 3.5 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు.
భవిష్యత్తులో ఫాస్ట్ ఛార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి వస్తే పల్నాడు బస్టాండ్ లో కూడా ఎలక్ట్రిక్ బస్సుల్ని కేటాయిస్తారు. గుంటూరులో ప్రధానంగా కాలుష్యం ఎక్కువవుతుండటంతో దీన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆర్టీసీలో ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించిన ఎక్స్ ప్రెస్ బస్సులను పల్లెవెలుగు బస్సుల్లా మార్చి తిప్పుతున్నారు. అయితే వీటి నిర్వహణ వ్యయం బాగా పెరుగుతుండటంతో విద్యుత్తు బస్సులవైపు ప్రభుత్వం మొగ్గుచూపింది. త్వరలోనే ఈ బస్సులు రాష్ట్రానికి రానున్నాయి.












Click it and Unblock the Notifications