ఏపీ స్కూళ్లలో కరోనా టెస్టులు-ప్రభుత్వం కీలక నిర్ణయం- తల్లితండ్రుల్లో భరోసా నింపేందుకే
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గకముందే ధర్డ్ వేవ్ భయాలు కూడా నెలకొంటున్నాయి.. ఇలాంటి పరిస్దితుల్లో ప్రభుత్వం విద్యాసంవత్సరం ప్రారంభించడంతో తల్లితండ్రులు తమ పిల్లల్ని స్కూళ్ళకు పంపేందుకు జంకుతున్నారు. టీచర్లకు ఇంకా పూర్తి స్దాయిలో వ్యాక్సినేషన్ పూర్తికాకపోవడంతో విద్యార్ధుల్ని స్కూళ్లకు పంపే విషయంలో వారు ఆందోళన చెందుతున్నారు.
Recommended Video
ఏపీలో కరోనా పరిస్ధితులపై ఇవాళ మరోసారి సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్ధులు, తల్లితండ్రుల్లో కరోనా భయాల నేపథ్యంలో స్కూళ్లలోనే కరోనా పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమైనా పూర్తిస్దాయిలో విద్యార్ధులు హాజరు కావడం లేదు. దీంతో ప్రభుత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.
కరోనా పరిస్ధితుల నేపథ్యంలో ఏపీ పాఠశాలల్లో ప్రభుత్వం విధించిన మార్గదర్శకాలను విధిగా పాటించాలని మరోసారి అధికారులకు ఆధేశాలు వెళ్లాయి. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా పరీక్షల నిర్వహణకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తద్వారా విద్యార్ధుల తల్లితండ్రుల్లో ఆందోళన తొలగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 16న స్కూళ్లు తెరిచినా పిద్యార్ధుల హాజరుశాతం తక్కువగా ఉండటంతో ప్రభుత్వం విద్యాకానుకను సైతం పూర్తిస్దాయిలో పంపిణీ చేయలేకపోయింది. దీంతో విద్యార్ధుల్ని ఎలాగైనా పాఠశాలలకు రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
మరోవైపు టీచర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇప్పటికీ పూర్తిస్ధాయిలో టీచర్లకు వ్యాక్సినేషన్ అందకపోవడంతో విద్యార్ధుల తల్లితండ్రుల్లో ఇది కూడా ఆందోళన నింపుతోంది. మరోవైపు ప్రభుత్వం స్కూళ్లలోనే కరోనా టెస్టులు చేయాలని తీసుకున్న నిర్ణయం సైతం తల్లితండ్రుల్లో ఆందోళన నింపేలా ఉంది. ఎందుకంటే కరోనా టెస్టుల నిర్వహణ ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తల్లితండ్రులు చెప్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే తమ పిల్లల్ని స్కూళ్లకు పంపుతామని చెప్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడా ఆ మేరకు సంసిద్ధమవుతోంది.