ఏపీలో ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛన్... వారికి మాత్రమే మినహాయింపు...
ఏపీలో ఇప్పటివరకూ ఒక రేషన్ కార్డుపై రెండు మూడు పింఛన్లు తీసుకుంటున్న కుటుంబాలకు షాక్ తప్పకపోవచ్చు. కుటుంబానికి ఉన్న రేషన్ కార్డులో వయసు మళ్లిన వారు ఉంటే వారి పేరు మీద రెండు, మూడు పింఛన్లు కూడా తీసుకునే వారు. అలాంటి వాటికి చెక్ పెట్టాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ఒక రేషన్ కార్డు దారుడికి ఒకే పింఛన్ మాత్రమే లభిస్తుంది. అంటే మిగతా వారి పింఛన్లను ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయించింది.
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం ... సెప్టెంబర్ 1 నుండి రేషన్ డోర్ డెలివరీ
వైఎస్సార్ పెన్షన్ భరోసా పథకంలో అక్రమాల నివారణకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కొందరికి మాత్రం ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. ఒకే రేషన్ కార్డుపై దివ్యాంగులు, డయాలసిస్, క్యాన్సర్, తలసీమియా పేషెంట్లు, ఇతర దీర్గకాలిక రోగాలతో బాధపడేవారు ఉంటే ప్రభుత్వం వారికి మినహాయింపు ఇచ్చింది. మిగతా వాటికి మాత్రం కచ్చితంగా ఒక కార్డుకు ఒకటే పింఛన్ సూత్రాన్ని వర్తింపజేయనుంది.
ఇప్పటికే ప్రభుత్వం ఆధార్, ప్రజా సాధికార సర్వే, నవశకం సర్వే ద్వారా పింఛన్ లబ్ది దారుల వివరాలను సేకరించింది. వీటిని పరిశీలించిన తర్వాత మరోసారి లబ్ది దారుల జాబితాను క్షేత్రస్దాయిలో అధికారులకు పంపింది. దీన్ని ఈ నెల 15వ తేదీ లోపు పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీని ఆధారంగా వచ్చే నెల నుంచి పింఛన్లలో కోత పడనుంది.