వాలంటీర్ల సేవల్లో మార్పు, కాలపరిమితి : ప్రభుత్వ తాజా నిర్ణయం..!!
ఏపీలో వాలంటీర్ల కొనసాగింపు పై చర్చ కొనసాగుతోంది. కొత్త ప్రభుత్వం వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేసింది. వాలంటీర్ల సేవల కొనసాగింపు పైన సందిగ్ధత కొనసాగుతోంది. వాలంటీర్ల సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలనే దాని పై కసరత్తు మొదలైంది. వలంటీర్ల కొనసాగింపుపై సానుకూలత ఉన్నా వారి పనితీరులో అనేక మార్పులు తేవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త ప్రతిపాదనలు తెర మీదకు వస్తున్నాయి.
ప్రభుత్వం కసరత్తు
వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల సేవలు మొదలయ్యాయి. ప్రభుత్వ పథకాల అమలులో వాలంటీర్లు కీలకంగా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో వాలంటీర్ల సేవల పైన వివాదం మొదలైంది. వాలంటీర్ల గురించి రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎన్నికల సంఘం పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పించారు. ఆ తరువాత తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగించటం తో పాటుగా పది వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబు నాడు హామీ ఇచ్చారు. ఇక, ఇప్పుడు తొలి నెల పెన్షన్ల పంపిణీలోనూ వాలంటీర్లను తప్పించారు. దీంతో, వాలంటీర్ల సేవల కొనసాగింపు పైన ప్రభుత్వ నిర్ణయం ఏంటనేది కీలకంగా మారుతోంది.

కొత్త ప్రతిపాదనలు
ఈ సమయంలో ప్రభుత్వం కీలక ప్రతిపాదనలు తెర మీదకు తస్తోంది. వలంటీర్ల ఉద్యోగాన్ని నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలనే ఆలోచనలో ఉందని సమాచారం. వలంటీర్ల కొనసాగింపుపై సానుకూలత ఉన్నా వారి పనితీరులో అనేక మార్పులు తేవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడేళ్లకు మించి వలంటీర్లను కొనసాగించరాదని, ప్రతి మూడేళ్లకు కొత్తవారిని నియమించాలని ప్రతిపాదన వచ్చింది. ఈ కాలంలోనే ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి ఇతర ఉద్యోగాలు సంపాదించుకొనే మార్గం చూపించాలనే ప్రతిపాదన పైన పరిశీలన జరుగుతోంది. వాలంటీర్ల వ్యవస్థలో తీసుకురానున్న మార్పుచేర్పులపై ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు పరిశీలించి తుది నిర్ణయానికి రావాలని యోచిస్తున్నట్లు సమాచారం.
వాలంటీర్ల పేరు మార్పు
వలంటీర్ల పేరు మార్చి గ్రామ సేవక్, వార్డు సేవక్గా మార్చాలనే అంశం పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇకపై వారిని స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకువచ్చి ఆ పనులు అప్పగించాలని భావిస్తున్నారు. పథకాల కింద లబ్ధిదారులకు చేసే డబ్బు పంపిణీతో వలంటీర్లకు సంబంధం లేకుండా చేయాలినే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వలంటీర్ల వేతనం రూ.పది వేలకు పెంచుతామని టీడీపీ ఇచ్చిన హామీ మేరకు ప్రకారం వీరికి వేతనం పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ప్రస్తుతం 50 ఇళ్లకు ఒక వలంటీర్ ఉండగా... ఇకపై ప్రతి వంద ఇళ్ల బాధ్యతలు ఒకరికి అప్పగించే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే ప్రభుత్వం వాలంటీర్ల సేవల పైన విధి విధానాలు అధికారికంగా ఖరారు చేయనుంది.












Click it and Unblock the Notifications