నన్ను ఇబ్బంది పెట్టొద్దు, మీరు హైద్రాబాద్లో ఉంటే ఎలా, త్యాగం తప్పదు: బాబు
విజయవాడ: దయచేసి తనను ఇబ్బంది పెట్టవద్దని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు ఏపీ సచివాలయ ఉద్యోగులతో అన్నారు. సచివాలయ ఉద్యోగులు ఆయనను క్యాంప్ కార్యాలయంలో కలిసిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. జూన్ తర్వాత సచివాలయ ఉద్యోగులు అందరూ విజయవాడకు రావాలని సూచించారు. ఉద్యోగులు కొన్ని త్యాగాలు చేయక తప్పదని వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు శాశ్వత బస ఇప్పుడే ఏర్పాటు చేయడం సాధ్యం కాదని, తాత్కాలిక బస ఏర్పాటు చేస్తామన్నారు.

నేనిక్కడ (అమరావతి), మీరు అక్కడ (హైదరాబాద్)లో ఉంటే ప్రభుత్వ కార్యకలాపాలు సజావుగా సాగడం లేదన్నారు. దయచేసి తనను ఇబ్బంది పెట్టవద్దన్నారు. ఉద్యోగులు హైదరాబాదులో, ముఖ్యమంత్రి విజయవాడలో ఉంటే ప్రభుత్వ పనులు జరగక ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోను జూన్ లోపు సచివాలయ ఉద్యోగులు అమరావతికి రావాల్సిందేనని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ఉద్యోగులు అడిగినవి అన్నీ ఇచ్చామని చెప్పారు. నవ్యాంధ్ర నిర్మాణానికి త్యాగాలు తప్పదని చెప్పారు.
ఉద్యోగులకు రెండు చోట్ల హెచ్ఆర్ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని, కేంద్రం నుంచి కూడా ఆశించిన స్థాయిలో సాయం అందడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులందరికీ తాత్కాలిక బస ఏర్పాటుకు సిద్ధమని చెప్పారు.












Click it and Unblock the Notifications