చిత్తూరు స్పెషల్- కర్ఫ్యూ సమయం పెంపు- కోవిడ్ నెగెటివ్ వస్తేనే జిల్లాలో అనుమతి..
ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతున్న మూడు జిల్లాల్లో చిత్తూరు, గోదావరి జిల్లాలు ఉన్నాయి. ఇందులోనూ చిత్తూరు జిల్లా పరిస్ధితి మరీ దారుణంగా ఉంటోంది. దేశంతో పాటు రాష్ట్రంలోనూ కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్నా చిత్తూరు జిల్లా పరిస్ధితిలో ఏమాత్రం మార్పులేదు. అంతే కాదు కరోనా మరణాల్లో సైతం చిత్తూరు జిల్లా టాప్లో ఉంది. దీంతో ఏపీ ప్రభుత్వం చిత్తూరు జిల్లాపై ఫోకస్ పెట్టింది.
ఏపీలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న చిత్తూరు జిల్లాలో పగటి కర్ఫ్యూ సమయాన్ని రెండు గంటల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. తాజా పొడిగింపు ప్రకారం ఉదయం 6 గంటల నుంచి పది గంటల వరకూ మాత్రమే షాపింగ్కు అనుమతిస్తారు. మిగతా సమయమంతా కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అందులోనూ కఠినంగా కర్ప్యూ అమలు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. చిత్తూరు జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రులు పెద్దిరెడ్డి, మేకపాటి, నారాయణస్వామి.. అనంతరం ఈ నిర్ణయాల్ని వెల్లడించారు.
దేశంలోనే కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న టాప్ -5 రాష్ట్రాల్లో ఉన్న కర్నాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న చిత్తూరు జిల్లాకు ఆయా రాష్ట్రాల నుంచి రాకపోకలు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో కరోనా కేసుల సంఖ్యా పెరుగుతోంది. కాబట్టి ఆయా రాష్ట్రాల నుంచి రాకపోకల్ని నియంత్రించాలని నిర్ణయించారు. కరోనా టెస్టు చేయించుకుని నెగెటివ్ వస్తేనే ఆయా జిల్లాల్లోకి అనుమతించాలని కూడా నిర్ణయించారు. జూన్ 1 నుంచి 15 వరకూ ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని మంత్రులు తెలిపారు.