GPS:జీపీఎస్ నోటిఫికేషన్ జారీ, గందరగోళం - ఉద్యోగుల ఆందోళన..!!
ఏపీ ప్రభుత్వ నోటిఫికేషన్ గందరగోళంగా మారింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్)లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను గ్యారంటీ పెన్షన్ స్కీమ్ (జిపిఎస్)లోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023 అక్టోబర్ 20 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. జిపిఎస్ అమలు చేస్తూ జూన్ 12వ తేదీన జిఓ 54ను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ జిఓ బయటకు రాలేదు. ఇప్పుడు జిపిఎస్ చట్టం అమల్లోకి తీసుకొస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ గెజిట్ విడుదలపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
నోటిఫికేషన్ జారీ
ఎన్నికల వేళ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విధంగా సీపీఎస్ రద్దు పైన నిర్ణయం తీసుకుంటామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సిపిఎస్) రద్దు చేసి, పాత పెన్షన్ స్కీమ్ (ఒపిఎస్) అమలు చేయాలని ఏళ్ల తరబడి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. సిపిఎస్ రద్దు చేసి ఒపిఎస్ అమలు చేస్తామన్న గత వైసిపి ప్రభుత్వం జిపిఎస్ పేరుతో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం సిపిఎస్ కంటే నష్టదాయకమని, దీనిని వెంటనే రద్దు చేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు గత ప్రభుత్వ హయాంలో తీవ్ర ఆందోళనలు నిర్వహించారు.

ప్రభుత్వం ఏమంటోంది
అయినా వైసిపి సర్కారు ఏకపక్షంగా జిపిఎస్ విధివిధానాలను తీసుకొచ్చింది. అయితే అమలుకు ఉత్తర్వులు విడుదల చేయలేదు. సిపిఎస్/జిపిఎస్ విధానాన్ని పున:సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తామని టిడిపి కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఇందుకు భిన్నంగా జిపిఎస్ అమలు చేసేందుకు జిఓను, గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ పైన ప్రభుత్వం నుంచి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ హయాంలో జీపీఎస్ చట్టం చేసారని గుర్తు చేస్తున్నారు.
ఉద్యోగుల ఆందోళన
ఈ నిర్ణయంతో తమకు సంబంధం లేదని.. గత ప్రభుత్వ నిర్ణయమని చెబుతున్నారు. కానీ, ఇప్పుడు నోటిఫికేషన్ రావటం పైన ఉద్యోగ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. ఈ గెజిట్ను వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2017లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో 57ను తక్షణం అమలు చేసి 2003 డిఎస్సి ఉపాధ్యాయులను పాత పెన్షన్ విధానంలోకి తీసుకోవాలని కోరారు. ఈ గెజిట్ను రద్దు చేసి తక్షణం పాత పెన్షన్ను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిరసనలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications