రైతులకు ప్రభుత్వం భారీ ఊరట, రూ.100కే ఆ భూముల రిజిస్ట్రేషన్..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వారసత్వ భూమలు రిజిస్ట్రేషన్ ఫీజులను సులభ తరం చేసింది. దశాబ్దాల కాలంగా తమ వద్దే ఉన్న భూములకు మరోసారి రిజిస్ట్రేషన్ ఫీజులను ఎందుకు కట్టాలనే ప్రశ్న వినిపిస్తోంది. దీంతో.. ప్రభుత్వం భూముల విలువ మేరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలను వసూలుకు నిర్ణయించింది. భారీ స్థాయిలో తగ్గింపుకు సిద్దమైంది. సచివాలయాల్లోనే వీటిని రిజిస్టర్ చేయించుకునే వెసులుబాటు కలిగించనుంది.
ఏపీ ప్రభుత్వం వారసత్వ వ్యవసాయ భూములకు కుటుంబసభ్యుల మధ్య భాగపంపిణీ ఒప్పందా ల రిజిస్ట్రేషన్ ఫీజుల విషయంలో సమూల మార్పులు తెచ్చింది. ఇకపై ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ రూ.10లక్షల లోపు ఉంటే స్టాంపు డ్యూటీగా రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. రూ.10లక్షల పైన ఉంటే రూ.1,000 చెల్లించాలి. వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూముల్ని కుటుంబసభ్యులు భాగపంపిణీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ విలువలో అధిక విలువ కలిగిన ఒక సభ్యుడి వాటాకు మినహాయింపు లభించేది.

మిగిలిన ఇద్దరి వాటాకు రిజిస్ట్రేషన్ విలువపై 1% స్టాంపుడ్యూటీ వసూలు చేసేవారు. కాగా, భాగ పంపిణీ ఆస్తుల రిజిస్ట్రేషన్ బాదుడుతో చిన్న, సన్నకారు రైతులపై అధికభారం పడింది. దీంతో చాలామంది రిజిస్ట్రేషన్కు ముందుకు రాలేదు. వెబ్ల్యాండ్లో 3.91 లక్షల పట్టాలు మృతుల పేర్లతోనే ఉన్నాయి.
కాగా, రాష్ట్రంలోని మొత్తం పట్టాదారుల్లో 4.57% ఇవే. రిజిస్ట్రేషన్ రుసుము భరించలేక చిన్న, సన్నకారు రైతులు 100 రూపాయల స్టాంపుపత్రంపై ఒప్పందాలకే పరిమితం అవుతున్నారు. దీంతో భూముల మ్యుటేషన్ కావడం లేదు. పట్టాదారు పాసుపుస్తకాలు రావడం లేదు. తరచూ సివిల్ వివాదాలు వస్తున్నాయి. ఆస్తి అమ్మినప్పుడు కుటుంబసభ్యులంతా వచ్చి సంతకాలు చేయాలి. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు ఇవ్వాలి.
తమ స్వాధీనంలోనే భూమి ఉన్నా దాని రిజిస్ట్రేషన్ విలువపై మళ్లీ 1%, 3% చొప్పున స్టాంపురుసుము ఎందుకు చెల్లించాలనేది రైతుల ప్రశ్నగా ఉంది. కుటుంబసభ్యుల మధ్య భాగపంపిణీకి ప్రభుత్వం ఊరట కల్పిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ విలువ రూ.10లక్షల వరకు ఉంటే స్టాంపు రుసుముగా రూ.100 తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ విలువ రూ.10లక్షలకు మించితే రూ.1,000 చెల్లించాలి.వారికి పట్టాదారు పాసుపుస్తకాలతో పూర్తి హక్కులు వస్తాయి. వ్యవసాయ భూములకే ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది.












Click it and Unblock the Notifications