ఏపీలో స్విగ్గీ ద్వారా కూరగాయల హోం డెలివరీ- సర్కార్ అనుమతి...
ఏపీలో లాక్ డౌన్ సడలింపులు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ కూరగాయల డెలివరీలకు బిగ్ బాస్కెట్ కు మాత్రమే అనుమతులు ఉండగా, తాజాగా స్విగ్గీకి కూడా అనుమతి ఇచ్చింది. దీనిపై ట్విట్టర్ లో స్విగ్గీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది.
ఏపీలో స్విగ్గీ ద్వారా కూరగాయలు..
కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తో ఆన్ లైన్ డెలివరీ సంస్ధలకు గిరాకీ బాగా పెరిగింది. ప్రజలు ఇళ్లవద్ద నుంచి బయటికి రాకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించడం, కరోనా భయాలతో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో ఆన్ లైన్ డెలివరీలకు ఎక్కడ లేని పోటీ ఏర్పడింది. అయితే ఏపీలో ఇవాళ్టి నుంచి కొంత మేర లాక్ డౌన్ సడలింపులు అమల్లోకి రావడంతో ప్రభుత్వం ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్ధ స్విగ్గీకి కూరగాయల పంపిణీకి అనుమతి మంజూరు చేసింది.
ఫుడ్ డెలివరీల నిషేధంతో కూరగాయలపై..
ఇప్పటివరకూ ఫుడ్ డెలివరీ మాత్రమే చేస్తూ వచ్చిన స్విగ్గీ సంస్ద.. ప్రభుత్వం లాక్ డౌన్ తర్వాత విధించిన నిషేధంతో రూటు మార్చింది. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పటికే కూరగాయలు పంపిణీ చేస్తున్న బిగ్ బాస్కెట్ సంస్ధకు పెరిగిన డిమాండ్ తో డెలివరీ బాయ్ ల కొరత ఏర్పడింది. దీంతో ఇప్పటివరకూ ఫుడ్ డెలివరీ చేస్తున్న స్విగ్గీ, జొమాటో వంటి సంస్ధలను సంప్రదించడం మొదలుపెట్టింది. అప్పటికే వ్యాపారాలు లేక ఖాళీగా ఉంటున్న డెలివరీ బాయ్ లను బిగ్ బాస్కెట్ కు ఇవ్వడం ఎందుకన్న ఆలోచనతో తామే కూరగాయల డెలివరీ ప్రారంభించేందుకు స్విగ్గీ సిద్ధమైంది. అసలే తెలంగాణ సర్కారు విధించిన నష్టంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్విగ్గీ ఏపీ ప్రభుత్వాన్ని అనుమతి కోరడం, మంజూరు చేయడం వెంటనే జరిగిపోయాయి.