బెజవాడ ఐకాన్ మారుతోంది : మిషన్ బిల్డ్ లో మరో అంకం: 1500 కోట్లు-ప్రభుత్వ తాజా ఆలోచన..!!
ఏపీ ప్రభుత్వం మిషన్ బిల్డ్ లో భాగంగా కొత్త నిర్ణయం తీసుకుంది. ఆదాయం సమకూర్చుకోవటానికి కమర్షియల్ ఆలోచనలతో ముందుకు వెళ్తోంది. ప్రభుత్వ భూముల అమ్మకానికి హైకోర్టు బ్రేకు లు వేయడంతో ఇప్పుడు ప్రభుత్వం కొత్త మార్గం ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందు కోసం తొలి అడుగులో భాగంగా.. ప్రభుత్వ అతిథిగృహాలను వాణిజ్య భవనాలుగా అభివృద్ధి చేసే బాధ్యతను నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్(ఎన్బీసీసీ) లిమిటెడ్ చేపట్టింది. విజయవాడ నడి బొడ్డున ఉన్న స్టేట్ గెస్ట్ హౌస్ ను వాణిజ్య సముదాయంగా మారుస్తున్నట్లుగా పీటీఐ కధనంలో పేర్కొంది.
కమర్షియల్ కాంప్లెక్స్ గా పీపీపీ విధానంలో
3.26 ఎకరాల్లో ఉన్న ఈ అతిథిగృహాన్ని వాణిజ్య భవనంగా అభివృద్ధి చేయబోతున్నారు. ఇందుకు అవసరమైన డిజైన్లు అందించేందుకు రుద్రాభిషేక్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(ఆర్ఈపీఎల్) అనే సంస్థకు సర్వీసును అప్పగించారు. ఇందుకు అవసరమైన డిజైన్లు..ప్రణాళికలు రూపొందించే బాధ్యత వీరికే ఇచ్చారు. ఇదే స్థలంలో ప్రస్తుతం ఉన్న గెస్ట్ హౌస్ ను కూల్చేసి..అక్కడే లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్తగా గెస్ట్ హౌస్ నిర్మాణంతో పాటుగా 2.5 లక్షల చదరపు అడుగుల వాణిజ్య సముదాయం నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు పీటీఐ తన కధనంలో వివరించింది.
1500 కోట్ల విలువైన స్థలంలో కొత్త ప్రణాళిక
1960లో అందుబాటులోకి వచ్చిన ఈ అతిథిగృహం విజయవాడకే ఒక ఐకాన్గా నిలిచింది. అయితే, కొన్నేళ్లుగా నిర్వహణ సవ్యంగా లేదు. ఇక్క డ పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ (పీపీపీ) విధానంలో 5 స్టార్ హోటల్ కట్టాలని 2018లో గత ప్రభుత్వం నిర్ణయించింది. స్టార్ హోటల్ నిర్మాణం అయ్యాక 30శాతం గదులు ప్రభుత్వానికి, మిగతాది ప్రైవేటు నిర్వహణకు ఇస్తే ఆదాయం కూడా వస్తుందని అం చనా వేశారు. ప్రస్తు తం ఈ భూమి విలువ రూ.1,500కోట్ల పైమాటే.
తొలిగా స్టేట్ గెస్ట్ హౌస్..క్రమేణా
దీంతో..ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మిషన్ బిల్డ్ కింద ఎన్బీసీసీ ని తీసుకొచ్చారు. విలువైన ప్రభుత్వ భూములను గుర్తించి ఆ సంస్థ ద్వారా అమ్మకాలు జరిపించాలని ప్రయత్నించారు. విశాఖ, గుంటూరుల్లో ప్రభుత్వ భూముల అమ్మకంపై హైకోర్టు స్టేఇచ్చింది. కేసుల విచారణ పూర్తికాలేదు. ఇప్పుడు అనూహ్యంగా భూ ముల అభివృద్ధి వ్యూహం తెరపైకి తీసుకొచ్చారు. అందులో విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ ను ఎంపిక చేశారు.
Recommended Video
జగన్ నిర్ణయం మరో రాజకీయ వివాదంగా మారుతుందా
3.26 ఎకరాల్లో ఉన్న దీనిని వాణిజ్య భవనంగా మార్చాలన్నది సర్కారు ప్రతిపాదన. గతంలో ఇదే స్టేట్ గెస్ట్ హౌస్ ఉన్న భూమిని అమ్మే ప్రయత్నాలు చేయగా..అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఇక, ఇప్పుడు భవాన్ని సైతం కొత్తగా నిర్మిస్తూ...మిగిలిన స్థలంలో కమర్షియల్ నిర్మాణానికి అనుమతి ఇవ్వటం ద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చనేది ప్రభుత్వ ఆలోచన. ఒక విధంగా కేంద్రం తాజాగా ప్రకటించిన మానిటైజేషన్ విధానంలోనే ఈ నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. దీని పైన ఇప్పుడు ప్రతిపక్షాలతో పాటుగా ప్రజా సంఘాలు ఎలా రియాక్ట్ అవుతాయనేది వేచి చూడాల్సిందే.