నిరుద్యోగులకు శుభవార్త-ఏపీలో 20వేల ఉద్యోగాల భర్తీ-ఉగాదికి జాబ్ క్యాలెండర్
ఏపీలో నిరుద్యోగులు ఎప్పటినుంచో ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 20 వేలకు పైగా ఉద్యోగాల్ని భర్తీ చేసేందుకు సిద్దమవుతోంది. ఇందుకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ను సీఎం జగన్ ఉగాది రోజు విడుదల చేయబోతున్నారు. ఇందులో పోలీసులు, సచివాలయాల ఉద్యోగులు, పశుసంవర్ధకశాఖలో అసిస్టెంట్ పోస్టులు వంటివి ఉన్నాయి. క్యాలెండర్ విడుదల తర్వాత దీనిపై మరింత స్పష్టత రానుంది. జాబ్ క్యాలెండర్ విడుదల తర్వాత ఆయా పోస్టుల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు రానున్నాయి.

ఏపీలో ఉగాదికి జాబ్ క్యాలెండర్
ఏపీలో నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పలు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ మేరకు ఎల్లుండి ఉగాది సందర్భంగా పలు ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సీఎం జగన్ చేతుల మీదుగా జాబ్ క్యాలెండర్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రతీ ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినా ఇప్పటివరకూ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో ఈసారి జాబ్ క్యాలెండర్ విడుదల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.

దాదాపు 20 వేల పోస్టుల భర్తీ
ప్రభుత్వం భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో ప్రధానంగా సచివాలయాల ఉద్యోగాలు, పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్ పోస్టులు, పోలీసు ఉద్యోగులు ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది. సచివాలయాల్లో 8402 పోస్టులు, యానిమల్ హస్బెండ్రీలో 6099 పోస్టులు, పోలీసు శాఖలో 6 వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. వీటిని భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్లో రిక్రూట్మెంట్ తేదీల్ని ప్రకటించాల్సి ఉంది. ఈ మేరకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Recommended Video

ఉద్యోగాల భర్తీ ప్రతిపాదనలు ఇవే
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇంకా 8,402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరించారు. ఈ ఖాళీలను ఏపీపీఎస్సీకి పంపి క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తామని మంత్రి చెప్పారు. త్వరలో పూర్తి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. అలాగే.. ఎంపీడీవోల పదోన్నతులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వెటర్నరీ వైద్యులు, సచివాలయాల్లో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్స్ (ఏహెచ్ఏ) పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. వెటర్నరీ వైద్యులు తప్పనిసరిగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆర్బీకేల్లో కూడా సేవలందించాలని, ఇందుకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని స్పష్టం చేశారు.
మరోవైపు రాష్ఠ్రంలో ఖాళీగా ఉన్న 6,099 ఎనిమల్ హజ్బెండరీ అసిస్టెంట్స్ (ఏహెచ్ఏ) పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. అలాగే వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ వెటర్నరీ లాబ్స్లో కొత్తగా 21 ల్యాబ్ టెక్నీషియన్స్, 21 ల్యాబ్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ వీటన్నింటికీ ఒకే కాల్ సెంటర్, ఒకే నంబర్ ఉండాలని పేర్కొన్నారు.
ఈ సంవత్సరం భర్తీచేయనున్న పోస్టులపై క్యాలెండర్ సిద్ధం చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. అలాగే పోలీసుశాఖలో ఈ ఏడాది 6 వేలమంది పోలీసు నియామకాలు చేయాలని సీఎం ఆదేశించారు.












Click it and Unblock the Notifications