నో కరప్షన్-ఇక ఆన్లైన్లోనే: స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖలో భారీ సంస్కరణలు
అమరావతి: రిజిస్ట్రేషన్ శాఖలో భారీ సంస్కరణలను చేపట్టాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన, పారదర్శకతను పెంచేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ప్రక్షాళనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నవంబర్ 1న రాష్ట్ర వ్యాప్తంగా సంస్కరణలు అమలు చేయనున్నట్లు ప్రకటించింది.
అవినీతికి తావులేకుండా, మధ్యవర్తుల కమిషన్లకు స్వస్తి పలుకుతూ ఇకపై క్రయ, విక్రయదారులే స్వయంగా తమ డాక్యుమెంట్ను తయారు చేసుకుని.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెడుతున్న ఈ కొత్త విధానాల ఫలితంగా రిజిస్ట్రేషన్ల శాఖలో మరింత పారదర్శకత వస్తుందని ఏపీ సర్కారు భావిస్తోంది.
ఇందుకు సంబంధించి 16 రకాల నమూనా డాక్యుమెంట్లను అధికారులు వెబ్సైట్లో ఉంచారు. విశాఖ, కృష్ణా జిల్లాలో ఈ పక్రియను ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్రభుత్వం నవంబర్ 1 నుంచి అన్ని జిల్లాల్లోనూ అమలు చేయనుంది. కాగా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తిరస్కరించే డాక్యుమెంట్ల అప్పీలుకు అవకాశం కల్పించారు.

ఏపీ రిజిస్ట్రేషన్ చట్టం 73,74 కింద రిజిస్ట్రార్కు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. సోమవారం నుంచి అన్ని జిల్లాల్లో నూతన విధానంపై వర్క్షాప్లు నిర్వహించనున్నారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలోని ఇళ్లు, భవనాలు, వ్యవసాయ భూములు, నివాసస్థలాలకు సంబంధించి సేల్ డీడ్, సేల్ అగ్రిమెంట్, తాకట్టు రిజిస్ట్రేషన్, బహుమతి రిజిస్ట్రేషన్లు, జీపీఏ తదితర కార్యకలాపాలకు అనుగుణంగా నమూనా డాక్యుమెంట్లను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ వెబ్సైట్లో పొందుపర్చారు. ఈ 16 డాక్యుమెంట్లలో క్రయ, విక్రయదారులు తమ వివరాలను నింపి వాటిని అప్లోడ్ చేయల్సి ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో నమూనాలను ఉపయోగించుకోవచ్చు.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ సిద్ధార్థజైన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అక్టోబర్ 14వ తేదీన కర్నూలు, విజయనగరం, 15న అనంతరపురం, శ్రీకాకుళం, 16న కడప, విశాఖపట్నం,
17న చిత్తూరు, తూర్పుగోదావరి, 18న నెల్లూరు, పశ్చిమగోదావరి, 19న ప్రకాశం, కృష్ణా, 21వ తేదీన గుంటూరు జిల్లాలో ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications