నిమ్మగడ్డతో మళ్లీ విభేదాలు: కార్యదర్శిగా ఆ ఐఎఎస్: వెంటనే బదిలీ: కొత్తగా ముగ్గురి పేర్లు
అమరావతి: పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ పర్వం ఆరంభం కాబోతోన్న వేళ జగన్ సర్కార్.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాయం మధ్య మరోసారి విభేదాలు తలెత్తాయి. ఘర్సణ వాతావరణం నెలకొంది. ఎన్నికల కమిషన్ కార్యాలయం కార్యదర్శిగా ఎవరిని నియమించాలనే విషయంపై ఈ రెండు పక్షాల మధ్య మరోసారి వివాదాలు తలెత్తాయి. తన కార్యాలయ కార్యదర్శిగా నియమించుకున్న ఐఎఎస్ అధికారిని ప్రభుత్వం రాత్రికి రాత్రి బదిలీ చేయడం.. దీనికి కారణమైంది. ఆయనకు బదులుగా కార్యదర్శిగా నియమించడానికి ముగ్గురు సీనియర్ ఐఎఎస్ అధికారుల పేర్లను ప్రభుత్వం ఎన్నికల కమిసన్ కార్యాలయానికి పంపించింది.

ముద్దాడ నియామకం.. అంతలోనే బదిలీ..
సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్రను నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఎన్నికల కమిషన్ కార్యాలయం కార్యదర్శిగా నియమించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్కు పంపించారు. ముద్దాడ రవిచంద్రను వెంటనే బదిలీ చేయాలని సూచించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడలేదు. కొద్దిసేపటికే.. ముద్దాడను ప్రభుత్వం వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.

కోవిడ్ మేనేజ్మెంట్.. వ్యాక్సినేషన్ పర్యవేక్షణ కోసం..
రాష్ట్రంలో కొనసాగుతోన్న కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి ప్రభుత్వం కొత్తగా ఓ కార్యదర్శి పోస్ట్ను సృష్టించింది. ఈ పోస్ట్లో ముద్దాడను నియమించింది. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమన్వయం పర్చడానికి కార్యదర్శి హోదా గల అధికారి నియామకం అవసరం ఉందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటిదాకా 1,58,758 మందికి వ్యాక్సిన్ వేశామని పేర్కొంది. వ్యాక్సిన్ వేయించుకున్న అనంతరం 49 మంది అనారోగ్యానికి గురయ్యారని స్పష్టం చేసింది.

పకడ్బందీగా పర్యవేక్షణ..
దీనితోపాటు వ్యాక్సినేషన్ కార్యక్రమం సుదీర్ఘకాలం పాటు కొనసాగబోతోన్నందున దీన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా కార్యదర్శి హోదా గల అధికారిని నియమించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఆ పోస్టులో ముద్దాడ రవిచంద్రను నియమించినట్లు వివరించింది. వ్యాక్సిన్ వేయించుకున్న అనంతరం ఓ హెల్త్ వర్కర్ మరణించారని, ఓ డెంటిస్ట్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని స్పష్టం చేసింది. ఇలాంటి పరిణామాలు తలెత్తినప్పుడు ప్రభుత్వం తరఫున జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది.

ముగ్గురు అధికారుల పేర్లు..
ముద్దాడ రవిచంద్రకు బదులుగా.. ముగ్గురు సీనియర్ ఐఎఎస్ అధికారుల పేర్లను ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కార్యాలయానికి పంపించింది. మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్, సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి రాజబాబు, మత్స్య శాఖ కమిషనర్ కన్నబాబుల పేర్లను ప్రభుత్వం పంపించింది. ఈ ముగ్గురిలో ఎవరినైనా నియమించుకోవచ్చని స్పష్టం చేసింది. కాగా- ఇదివరకు ఎన్నికల కమిషన్ కార్యాలయం కార్యదర్శిగా పనిచేసిన వాణీ మోహన్ను నిమ్మగడ్డ రమేష్ కుమార్.. వెనక్కి పంపించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications