జగన్ ప్రభుత్వం దిద్దుబాటు-ఒత్తిడికి తలొగ్గిందా : ఆ నిర్ణయంలో మార్పు-కండీషన్స్ అప్లై..!!
ఎట్టకేలకు ఏపీలోని జగన్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. కొత్త సవరణలతో తిరిగి పాత తరహాలోనే అదే విధానం కొనసాగించాలని నిర్ణయించింది. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ జారీ చేసే ఉత్తర్వులను ఓపెన్ కాకుండా..బయటకు తెలిసే అవకాశం లేకుండా నిర్ణయం తీసుకుంది. అప్పటికే ప్రభుత్వం పలు జీవోలను కాన్ఫిడెన్షియల్..బ్లాంక్ జీవోలను జారీ చేసింది. దీని పైన ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శ లు వెల్లు వెత్తాయి. దీంతో...ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధంగానే అసలు జీవో జారీ వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వ అంతర్గత వ్యవహారంగా మారుస్తూ..జీవోలను బహిర్గతం చేయకూడదని నిర్ణయం తీసుకుంది.

జగన్ ప్రభుత్వ జీవోల నిర్ణయంపై అభ్యంతరాలు
జీవోలను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయటం నిలుపుదల దీని పైన పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో 2008 నుంచి జీవోలను ప్రత్యేక వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయటం ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం వరకూ ఇదే విధానం కొనసాగించారు. అయితే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పాదర్శక పాలన పైన ప్రశ్నలు మొదలయ్యాయి. ప్రభుత్వ పారదర్శకంగా పాలన చేస్తుంటే..నిర్ణయాలను జీవోలు జారీ చేసి వాటిని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటనే ప్రశ్నలు మొదలయ్యాయి.

ఏపీ ప్రభుత్వ దిద్దుబాటు చర్యలు
దీని పైన న్యాయస్థానాల్లో పిటీషన్లు దాఖలయ్యాయి. దీంతో..ప్రభుత్వం పునరాలోచన చేసింది. తమ నిర్ణయం మార్చుకోవాలని డిసైడ్ అయింది. దీనికి సంబంధించి తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు తిరిగి అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో విధంగా కాకుండా మార్పులు చేసింది. ఏపీ ఈ-గెజిట్ ద్వారా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.

నిర్ణయం మార్చుతూ..కొత్తగా అమలు
జీవో ఐఆర్ వెబ్సైట్ను నిలిపివేసినందున సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలగకుండా వివరాలను ఈ-గెజిట్లో ఉంచనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రజలకు అవసరం లేని వ్యక్తిగతమైన సమాచారం, తక్కువ మొత్తంలోని ఖర్చులు, అధికారుల సెలవులు, గోప్యంగా ఉంచాల్సిన ఇతర అంశాలను అందులో అందుబాటులో ఉంచబోమని స్పష్టం చేసింది. ఇకపై అన్ని జీవోలు అధీకృత అధికారి డిజిటల్ సంతకంతో అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.
Recommended Video

ప్రభుత్వ తాజా నిర్ణయంతో వివాదం ముగిసిందా
దీని ద్వారా ప్రజలకు అవసరమైన సమాచారం..నిర్ణయాలు మాత్రం జీవోల రూపంలో అందుబాటులో ఉండనున్నాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా పేర్కొన్న కేటగిరీలకు సంబంధించిన సమాచారం మాత్రం గోప్యంగానే ఉండనున్నాయి. ప్రభుత్వం తొలుత తీసుకున్న నిర్ణయం మీద ప్రతిపక్షాల తో పాటుగా పలువురు మేధావులు సైతం స్పందించారు. ఇక, ఇప్పుడు ప్రభుత్వం తమ నిర్ణయంలో మార్పులు చేయటం పైన ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications