ఏపీలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు.. రెడ్ జోన్ల బయట అనుమతి...
ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్ డౌన్ కారణంగా మూతపడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను సడలింపుల్లో భాగంగా రేపటి నుంచి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మద్యం దుకాణాలను తెరిచేందుకు అనుమతించిన ప్రభుత్వం.. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రెడ్ జోన్ల బయట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు తెరిచేందుకు ఆదేశాలు ఇచ్చింది. లాక్ డౌన్ కారణంగా నెలన్నర రోజులుగా భారీగా ఆదాయం కోల్పోయిన ప్రభుత్వం... రిజిస్ట్రేషన్లకు అనుమతివ్వడం ద్వారా తిరిగి ఆదాయాన్ని రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.
Recommended Video
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. వీటి ప్రకారం ఉద్యోగులతో పాటు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారు కూడా మాస్క్ లు ధరించాలని సూచించింది. ఆరు అడుగుల దూరాన్ని పాటిస్తూ కార్యకలాపాలు సాగాలని ఆదేశించింది. రిజిస్ట్రేషన్ కోసం ముందుగా వచ్చే వారికి ముందుగా అనుమతి ఇవ్వాలని రిజిస్ట్రార్లకు సూచించింది. అలాగే ఉద్యోగుల హాజరు కోసం వాడే బయోమెట్రిక్ యంత్రాలను రోజూ శానిటైజ్ చేయాలని కోరింది. పది మంది కంటే ఎక్కువగా గుమికూడకుండా ఉంచాలని, ఆఫీసులను రోజూ డిస్ ఇన్ ఫెక్షన్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది. ఇతరులు ఎవరినీ కార్యాలయాలకు అనుమతించరాదని ఆదేశించింది.