జగన్ సర్కార్ కీలక నిర్ణయం. హైదరాబాద్ నంచి ఏపీకి ప్రత్యేక బస్సులు- తర్వాత చెన్నై, బెంగళూరు..
కరోనా వైరస్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కితీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ పేరుతో ప్రత్యేత విమానాలను నడుపుతోంది. అదే తరహాలో రైల్వేశాఖ కూడా ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా 15 ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇదే కోవలో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన రాష్ట్ర వాసుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది.

తొలి దశలో హైదరాబాద్ నుంచి...
హైదరాబాద్ లో ఏపీ నుంచి వెళ్లి ఉద్యోగాలు, ఉపాధి వెతుక్కుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీరంతా కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్ లోనే ఉంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారు కూడా హైదరాబాద్ నుంచి తమను ఏపీకి పంపాలని పలు విజ్ఞప్తులు చేస్తున్నా ప్రభుత్వాలు ఇప్పటివరకూ పట్టించుకోలేదు. కానీ తాజాగా ఏపీ సర్కారు వీరి కోసం ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో చిక్కకున్న వారిని ఈ బస్సుల్లో ఏపీకి తీసుకొచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆర్టీసీకి ఆదేశాలు ఇచ్చింది.

హైదరాబాద్ లో ఎక్కడెక్కడి నుంచి...
హైదరాబాద్ లోని మియాపూర్-బొల్లారం క్రాస్ రోడ్స్, కూకల్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, ఎల్బీనగర్ నుంచి ఈ ప్రత్యేక బస్సులను నడపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో బయలుదేరే బస్సులు పరిమిత స్టాపులతో ఏపీలోని వివిధ నగరాలు, పట్టణాలకు చేరుకుంటాయి. హైదరాబాద్ లోని ఆయా ప్రాంతాల నుంచి ఏపీకి రావాలనుకునే వారు ముందుగా ఏపీ ప్రభుత్వానికి చెందిన స్పందన పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం విడుదల చేయనుంది.

ఏపీకి రావాలంటే షరతులు ఇవే...
హైదరాబాద్ లో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రత్యేక బస్సుల్లో ఎక్కి ఏపీలోని వివిధ ప్రాంతాలకు రావాలనుకునే వారికి ప్రభుత్వం కొన్ని షరతులు పెడుతోంది. వీటిలో ప్రధానంగా బస్సుల్లో ప్రయాణం చేసే వారంతా స్వస్ధలాలకు చేరుకోగానే సంబంధిత జిల్లాల్లో ఉండే క్వారంటైన్ సెంటర్లో ఉంటామని అంగీకరిస్తేనే టికెట్లు జారీ చేస్తారు. అలాగే వీరి కోసం ఏర్పాటు చేసే ఏసీ బస్సుల్లో గరుడ బస్సుల ఛార్జీలను, నాన్ ఏసీ బస్సుల్లో సూపర్ లగ్జరీ ఛార్జీలను వసూలు చేస్తారు. వీటికి అంగీకరిస్తేనే టికెట్ తీసుకునే అవకాశం ఉంటుంది.

రెండో దశలో చెన్నై, బెంగళూరు నుంచి...
తొలి దశలో హైదరాబాద్ లో చిక్కుకున్న వారిని ఏపీకి చేర్చిన తర్వాత రెండో దశలో చెన్నై, బెంగళూరుతో పాటు ఇతర నగరాల్లో చిక్కుకుపోయిన ఏపీ వాసులకు ఇదే అవకాశం కల్పిస్తారు. వీరు కూడా స్పందన పోర్టల్ లో పేర్లను నమోదు చేసుకుంటే వారి సంఖ్య ఆధారంగా ప్రత్యేక బస్సులను నడపాలని ఏపీఎస్ఆర్టీసీ భావిస్తోంది. దీనిపై అధికారులు ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. త్వరలో బస్సుల వివరాలను, ఛార్జీలను అధికారికంగా ప్రకటిస్తారు.












Click it and Unblock the Notifications