ఏపీ హైకోర్టు సంచలనం-ఆ రెండు లేఖలూ పిల్గా స్వీకరణ- సామాన్యులకు ఊరట
సాధారణ ప్రజలకు న్యాయం కరువవుతున్న వేళ ఏపీ హైకోర్టు తమకు అందిన రెండు ఫిర్యాదులపై స్పందించిన తీరు న్యాయస్ధానాలపై నమ్మకం పెంచేలా ఉంది. విషయానికొస్తే ఏఫీ హైకోర్టుకు గుంటూరు నుంచి ఓ ఫిర్యాదు లేఖ, విశాఖపట్నం నుంచి మరో అంశంపై మరో ఫిర్యాదు లేఖా అందాయి. వీటిని హైకోర్టు పిల్ కమిటీకి రిఫర్ చేయగా.. రెండు అంశాల్ని సుమోటో పిల్గా పరిగణించవచ్చని కమిటీ అభిప్రాయపడింది. దీంతో హైకోర్టు ఈ రెండు లేఖల్ని రెండు ప్రజాప్రయోజన వాజ్యాలుగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
హైకోర్టు అసాధారణ నిర్ణయాలు
ఏఫీ హైకోర్టు తాజాగా రెండు ప్రజా ప్రయోజన అంశాలపై దాఖలైన ఫిర్యాదుల్ని పరిశీలించి సుమోటో ప్రజా ప్రయోజన వాజ్యాలుగా విచారణ జరిపేందుకు అంగీకరించడం సంచలనంగా మారింది. వీటిలో కరోనా రోగులకు కాలం చెల్లిన మందులు ఇస్తున్నారనే ఫిర్యాదు ఒకటి కాగా.. రోడ్లపై తిరిగే మానసిక రోగుల్ని స్ధానిక ఆస్పత్రుల్లో చేర్పించే అంశం మరొకటి. ఈ రెండు అంశాలపై త్వరలో హైకోర్టు ధర్మాసనాలు వేర్వేరుగా విచారణ జరపబోతున్నాయి. ఈ రెండు అంశాల్లోనూ ప్రభుత్వం ప్రతివాదిగా మారబోతోంది.
కరోనా రోగులకు కాలం చెల్లిన మందులు
విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు కాలం చెల్లిన మందుల్ని నకిలీ స్టిక్కర్లు వేసి ఇస్తున్నారంటూ గుంటూరుకు చెందిన మణిరత్నం అనే వ్యక్తి హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. విజయనగరం జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆధారాల్ని సైతం మణిరత్నం హైకోర్టుకు పంపారు. దీంతో వీటిని పరిశీలించిన హైకోర్టు సుమోటో పిల్గా విచారణకు స్వీకరించాలని నిర్ణయించింది. ఈ పిల్లో సీఎస్, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, డ్రగ్ కంట్రోల్ అధారిటీలను ప్రతివాదులుగా చేర్చారు.
రోడ్లపై మతిస్ధిమితం లేని వారిని ఆస్పత్రుల్లో చేర్చేలా
మతిస్దిమితం లేకుండా రోడ్లపై తిరుగుతున్న రోగుల్ని, బాధితుల్ని స్ధానిక ఆస్పత్రుల్లో చేర్చాల్సిన బాధ్యత హెల్త్కేర్ చట్టం ప్రకారం పోలీసులపై ఉంది. కానీ పోలీసులు ఎక్కడా అలాంటి ప్రయత్నాలే చేయడం లేదు. దీంతో వైజాగ్ మెంటల్ ఆస్పత్రి ప్రొఫెసర్ డాక్టర్ రామానంద్ సత్పతి దీనిపై హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. వైజాగ్ పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేసినా దీనిపై స్పందన లేదన్నారు. పోలీసులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన హైకోర్టును కోరారు. దీన్ని కూడా హైకోర్టు రిజిస్ట్రీ సుమోటో పిల్గా స్వీకరించింది.
దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది.