మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి జగన్ షాక్- సమర్ధించిన హైకోర్టు...
కడప జిల్లాలో ఒకప్పుడు వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ ఆ తర్వాత టీడీపీ పంచన చేరిన జమ్మలమడుగు నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి జగన్ ప్రభుత్వం తాజాగా షాక్ ఇచ్చింది. ఆయనకు గతంలో ఉన్న 1 ప్లస్ 1 భద్రతను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
మాజీ మంత్రిగా, కడప జిల్లాలో అధికార వైసీపీ నుంచి ప్రాణహాని ఉన్నందున తనకు భద్రత కొనసాగించేలా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ఆదినారాయణరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. ఆదికి భద్రత కొనసాగించడంపై ప్రభుత్వం తన అభిప్రాయం వెల్లడించింది. రాష్ట్రంలో గతేడాది తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రముఖుల భద్రతను సమీక్షించి చేసిన మార్పుల్లో భాగంగానే ఆదికి భద్రత తొలగించినట్లు పేర్కొంది. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా కూడా లేని ఆదికి భద్రత అవసరం లేదని ప్రభుత్వం భావించినట్లు తెలిపింది. ఈ వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. ఆధినారాయణరెడ్డికి భద్రత తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఆది పిటిషన్ను తోసిపుచ్చింది.
Recommended Video
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నుంచి అధికార పార్టీలోకి ఫిరాయించిన ఆధినారాయరెడ్డి మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. ఎన్ని విమర్శలు ఎదురైనా జగన్ తో పాటు వైసీపీ నేతలను ఎదిరించి నిలిచారు. చివరికి వైఎస్ వివేకా హత్య కేసులోనూ వైసీపీ ప్రభుత్వం ఆయన్ను విచారించింది. వైసీపీ ప్రభుత్వం రాగానే బీజేపీలోకి వెళ్లిపోయిన ఆది.. వివేకా హత్యపై పోరాడి మరీ సీబీఐ విచారణ వేయించడంలో సక్సెస్ అయ్యారు. అప్పటి నుంచి ఆయనపై దాడుల భయం పెరిగినట్లు తెలుస్తోంది.