మూడు రాజధానుల పిటిషన్లపై హైకోర్టు కీలక నిర్ణయం-ఫుల్ బెంచ్ ఏర్పాటు- ఇక రెగ్యులర్ విచారణ
ఏపీలో మూడు రాజధానుల్ని ఏర్పాటు చేస్తూ వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం చట్టసభలతో పాటు గవర్నర్ ఆమోదం పొందినా ఇంకా అమల్లోకి రాలేదు. దీనికి కారణం న్యాయవివాదాలే. అమరాపతి నుంచి రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా రైతులు, విపక్షాలు దాఖలు చేసిన దాదాపు వందకు పైగా పిటిషన్లు హైకోర్టులో విచారణలో ఉన్నాయి. అయితే ఈ విచారణ ఎప్పటినుంచో పెండింగ్ లో ఉంది.
ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ త్వరలో ప్రారంభం కాబోతోంది. రాజధానుల్ని వ్యతిరేకిస్తూ దాఖలైన వందకు పైగా పిటిషన్ల విచారణ కోసం హైకోర్టు ఫుల్ బెంచ్ ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ బెంచ్ రాజధానుల పై దాఖలైన అన్ని పిటిషన్లను విచారించబోతోంది. వీటిలో రైతులతో పాటు విపక్షాలు, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లు కూడా ఉన్నాయి.

రాజధానులపై దాఖలైన పిటిషన్ల విచారణ కోసం ఏర్పాటైన హైకోర్టు ఫుల్ బెంచ్ ఈ నెల 23 నుంచి వీటిపై రెగ్యులర్ విచారణ జరపబోతోంది. వాస్తవానికి గతేడాది రాజధాని పిటిషన్ల విచారణ కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో హైకోర్టు ఛీఫ్ జస్టిస్ గా ఉన్న జస్టిస్ జేకే మహేశ్వరి సిక్కిం హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఆయన స్ధానంలో సీజేగా వచ్చిన జస్టిస్ అరూప్ గోస్వామి వెంటనే రాజధాని పిటిషన్లపై విచారణ ప్రారంభించలేదు. దీంతో వరుసగా వాయిదా పడుతూ వస్తున్న ఈ పిటిషన్ల విచారణ ఇకపై రెగ్యులర్ గా కొనసాగబోతోంది.
Recommended Video
ఏపీ మూడు రాజధానుల పిటిషన్లు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాల్ని విశాఖ, కర్నూలు రాజధానులకు తరలించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చివరికి సీఎం జగన్ విశాఖలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసేందుకు కూడా అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇప్పుడు హైకోర్టు రాజధానుల పిటిషన్లపై విచారణ ప్రారంభించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే అప్పుడు దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. హైకోర్టు నిర్ణయం కోసం ఏపీలో అధికార విపక్షాలతో పాటు సాధారణ ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications