జగన్ సర్కార్, టీటీడీకి హైకోర్టు నోటీసులు- రమణదీక్షితుల నియామకంపై
టీటీడీ మరో వివాదంలో చిక్కుకుంది. టీటీడీ ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితుల్ని నియమించడాన్ని సవాల్ చేస్తూ ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు.. ఏపీ ప్రభుత్వంతో పాటు టీటీడీ, రమణ దీక్షితులకు నోటీసులు జారీ చేసింది.
గత టీడీపీ ప్రభుత్వంలో టీటీడీ ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణదీక్షితులను ఆ పదవి నుంచి తొలగించారు. దీంతో ఆయన పింక్ డైమండ్తో పాటు మరెన్నో ఆరోపణలను తెరపైకి తెచ్చారు. తద్వారా రాజకీయంగా టీడీపీకి ఇబ్బందులు తప్పలేదు. అదే సమయంలో వైసీపీ అధికారంలోకి వస్తే రమణదీక్షికులకు తిరిగి ప్రధాన అర్చకుడిగా నియమిస్తామని జగన్ హామీ ఇచ్చారు. అన్నట్లుగానే వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఆయన్ను టీటీడీ ప్రధాన అర్చకుడిగా నియమించారు.
Recommended Video
రమణదీక్షితులను టీటీడీ ప్రధాన అర్చకుడిగా నియమించడం ద్వారా ఆ పదవి కోల్పోయిన వేణుగోపాల దీక్షితులు ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. గత ప్రభుత్వంలో తొలగించిన రమణదీక్షితులను ఇప్పుడు తిరిగి ఆ పదవిలో ఎలా నియమిస్తారని కోర్టులో ప్రశ్నించారు. దీంతో ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్దానం ఏపీ ప్రభుత్వంతో పాటు తిరుమల, తిరుపతి దేవస్ధానం, రమణదీక్షికులకు కూడా నోటీసులు జారీ చేసింది. వేణుగోపాల దీక్షికులు పిటిషన్పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.