వైసీపీకి షాక్- రేపు పోలీసు భద్రతతో కొండపల్లి ఎన్నిక-హైకోర్టు కీలక ఆదేశాలు
ఏపీలో తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా విజయాలు నమోదు చేసుకున్నా ప్రకాశం జిల్లా దర్శితో పాటు కృష్ణాజిల్లా కొండపల్లి నగర పంచాయతీలో మాత్రం టీడీపీ ఆధిక్యం సాధించింది. దర్శిలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా కొండపల్లిలో మాత్రం నగర పంచాయతీ చైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ చివరి నిమిషం వరకూ ప్రయత్నించింది. తమకు బలం లేదని తెలిసి ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలకు ఇవాళ హైకోర్టు బ్రేక్ వేసింది.
కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలను రేపు పోలీసు భద్రత మధ్య నిర్వహించాలని హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది. అలాగే కౌన్సిలర్లకు పోలీసు భద్రత కల్పించాలని కూడా ఆదేశించింది. వాస్తవానికి తాజా ఎన్నికల్లో 29 వార్డులకు ఎన్నికలు జరగగా.. ఇందులో టీడీపీ, వైసీపీ 14 వార్డుల చొప్పున గెల్చుకున్నాయి. మరో వార్డు మాత్రం ఇండిపెండెంట్ శ్రీలక్ష్మి గెలిచారు. ఆ తర్వాత ఆమె టీడీపీకి మద్దతు ప్రకటించారు. అదే సమయంలో కో ఆప్షన్ సభ్యుడిగా టీడీపీ స్ధానిక ఎంపీ కేశినేని నాని నమోదు చేయించుకున్నాకరు. దీంతో టీడీపీ బలం 16కు చేరింది. దీంతో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కానీ దీన్ని ఎలాగైనా అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
వైసీపీ కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్లో సామాగ్రి చిందరవందర చేసి గందరగోళం సృష్టించారు. దీంతో ఎన్నిక జరికే పరిస్ధితి లేకుండా చేశారు. ఈ కారణంతో రిటర్నింగ్ అధికారి అయిన మున్సిపల్ కమిషనర్ రెండుసార్లు ఎన్నిక వాయిదా వేశారు. చివరికి ఈ వ్యవహారం మరోసారి హైకోర్టుకు చేరడంతో న్యాయస్ధానం కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు ఎట్టిపరిస్దితుల్లోనూ పోలీసు భద్రత మధ్య ఎన్నికలు నిర్వహించి తీరాలని తేల్చిచెప్పింది. దీంతో అధికారులు రేపు ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నారు.