సీబీఐకి ఎమ్మెల్సీ అనంతబాబు కేసు ? హైకోర్టు తీర్పు రిజర్వ్ !
ఏపీలో తీవ్ర సంచలనం రేపిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్ర్మహ్మణ్యం హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు కావడం, కోర్టు రిమాండ్ కు పంపడం జరిగిపోయాయి. హైకోర్టును ఆశ్రయించి ఆయన బెయిల్ కూడా తెచ్చుకున్నారు. అయితే ఈ కేసులో తమకు న్యాయం జరగలేదని, సీబీఐకి ఈ కేసును అప్పగించాలని కోరుతూ మృతుడి తల్లితండ్రులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు ముగిశాయి.
దళితుడైన తన కారు డ్రైవర్ వీధి సుబ్రమణ్యాన్ని హత్య చేయడమే కాకుండా డోర్ డెలివరీ చేసిన ఘటనపై ఎమ్మెల్సీ అనంతబాబు నిందితుడిగా ఉన్నాడు. అయితే ఏపీ పోలీసులు చేసిన దర్యాప్తులో అనంతబాబును మాత్రమే నిందితుడిగా చూపారు. కానీ సీసీటీవీ కెమెరాల్లో ఆయన భార్య కూడా కనిపించిన పోలీసులు సహ నిందితురాలిగా చేర్చకపోవడాన్ని హైకోర్టు ఇవాళ వాదనల సందర్భంగా ప్రశ్నించింది. అయితే దీనిపై పోలీసులు వివరణ ఇవ్వలేకపోయారు.

పోలీసులు విచారణ సరిగా చేయలేదని, సీసీటీవీ ఫుటేజ్ వివరాలు కూడా తెలుసుకునేందుకు ప్రయత్నించలేదని విచారణ సందర్భంగా పిటిషనర్ లాయర్ వాదించారు. దీంతో సీసీటీవీ ఫుటేజ్ లో వివరాలు కేసులో ఎందుకు పేర్కొనలేదని హైకోర్టు ప్రశ్నించింది. సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా అనుబంధ చార్జ్షీట్ లేదని హైకోర్టు ఇవాళ వ్యాఖ్యానించింది. మరోవైపు ఈ హత్య కేసులో నిందితుడుగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని పిటిషనర్ లాయర్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
దీంతో సింగిల్ జడ్జ్ ఆదేశించినా సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నవారు ఎవరో పోలీసులు కనుక్కోకపోవడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. హత్యలో వారి పాత్ర లేదని ఎలా నిర్దారణకు వచ్చారని పోలీసుల్ని ప్రశ్నించింది. వివరాలను అదనపు చార్జ్షీట్లో ఎందుకు పేర్కొనలేదని అడిగింది. దీనిపై వివరణ ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. తాజాగా విచారణలో పిటిషనర్ల తరపు లాయర్ అవే అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో పోలీసులు ఇరుకునపడ్డారు. అయితే వాదనలు పూర్తి చేసిన ధర్మాసనం.. సీబీఐకి ఈ కేసు ఇవ్వాలా వద్దా అన్న అంశంపై తీర్పును రిజర్వ్ చేసింది.












Click it and Unblock the Notifications